జీహెచ్ఎంసీలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్: ఒక్కరోజే 39,110 మందికి వ్యాక్సిన్ పంపిణీ
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులు నగరంలో కరోనా వ్యాక్సినేషన్పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే గురువారం ఒక్కరోజే హైదరాబాద్ నగర పరిధిలో 39,110 మందికి కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది.
హైదరాబాద్ నగరంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేసేందుకు ఉద్దేశించిన స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్లో భాగంగా గురువారం 151 కాలనీల్లో 597 సంచార వ్యాక్సినేషన్ వాహనాలు ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్లు వేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియకు 16,185 మంది జీహెచ్ఎంసీ సిబ్బంది, 6016 మంది ఆరోగ్య సిబ్బంది, 2289 సంచార వ్యాక్సినేషన్ వాహనాలను వినియోగించినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది.

స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో 1878 కాలనీల్లో వ్యాక్సినేషన్ పూర్తయింది. 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయని కాలనీల సంఖ్య 1333కు చేరింది. గురువారం ఒక్కరోజే మొదటి డోసు తీసుకున్నవారు 31,888 మంది. రెండో డోసు తీసుకున్నవారి సంఖ్య 7222. డ్రైవ్ ద్వారా ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 1,27,236కు చేరింది. డ్రైవ్ ద్వారా మొదటి డోసు తీసుకున్నవారి సంఖ్య 1,07,000కు చేరింది. రెండో డోసు తీసుకున్నవారి సంఖ్య 20,000లకు చేరింది.
మరోవైపు తెలంగాణలో కరోనావైరస్ కొత్త కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 81,193 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 357 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వీటితో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,56,455కి చేరింది. గత 24 గంటల్లో కరోనా వైరస్తో ఒక్కరు చనిపోయారు. దీంతో మొత్తం మరణాలల సంఖ్య 3,865కి చేరింది. కరోనా నుంచి 405 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 6,46,344కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6246 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇది ఇలావుండగా, దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. గత 24 గంటల దేశంలో కరోనా కేసులు భారీగా పెరగడంపై కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోందని, నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అనేక పండగలు ఉండటంతో కరోనా నియంత్రణలో ఈ రెండు నెలలు అత్యంత కీలకమని స్పష్టం చేసింది.
దేశ ప్రజలంతా తగిన జాగ్రత్తలతో పండగలను జరుపుకోవాలని విజ్ఞప్తి చేసింది. దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, ఇతర అధికారులు మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్లు వ్యాధి నుంచి రక్షణ మాత్రమే కల్పిస్తాయని, అందువల్ల వ్యాక్సినేషన్ తర్వాత కూడా ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా వాడాలని, కరోనా నిబంధనలను పాటించాలని సూచించారు.
Recommended Video
కేరళలో కరోనా ఉధృతిపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. దేశ వ్యాప్తంగా గత వారంలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 58.4 శాతం ఒక్క కేరళలోనే నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో 3.33 లక్షల యాక్టివ్ కేసులు ఉండగా.. వాటిలో లక్షన్నరకు పైగా(51శాతం) ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఉన్నాయని వెల్లడించారు. దేశంలో లక్షకుపైగా యాక్టివ్ కేసులున్న ఏకైక రాష్ట్రం కేరళనే కావడం గమనార్హం. గత 24 గంటల్లో 30వేలకుపైగా కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications