సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందించాలని, ప్రధాన నగరాల మధ్య ఉన్న దూరాన్ని అతి తక్కువ సమయంలో చేరుకునేలా ఉండాలనే ఉద్దేశంతో భారతీయ రైల్వే సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. అత్యాధునిక సౌకర్యాల కల్పనలో ముందున్న ఈ రైళ్లు అతి తక్కువ సమయంలోనే ప్రయాణికులను ఆకట్టుకున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల మధ్య ఇవి నడుస్తున్నాయి. ప్రస్తుతం సిట్టింగ్ సౌకర్యం మత్రమే ఉండగా.. త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టబోతున్నారు.
ఈ నెల 12వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశవ్యాప్తంగా 10 వందేభారత్ రైళ్లను వర్చువల్ గా ప్రారంభించబోతున్నారు. వీటిల్లో ఇప్పటికే భువనేశ్వర్-విశాఖపట్నం మధ్య ఒక వందేభారత్ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో వందేభారత్ రైలును ఏపీకి, తెలంగాణకు కేటాయించారు. ఇది సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య తిరగనుంది. ప్రస్తుతం విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య ఒక వందేభారత్ నడుస్తోంది. దీనికి ప్రయాణికుల నుంచి ఆదరణ దక్కుతుండటంతో మరో రైలును ప్రారంభించబోతున్నారు.

ప్రస్తుతం నడుస్తున్న విశాఖ-సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ (20833, 20834) ఉదయం 5.45 గంటలకు విశాఖలో బయలుదేరి రాజమండ్రి (7.55), విజయవాడ (10.00), ఖమ్మం (11.00), వరంగల్ (12.05) స్టేషన్లలో ఆగుతూ మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి మూడు గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. ఇప్పుడు ప్రారంభించబోయే వందే భారత్ ఉదయం సికింద్రాబాద్ లో బయలుదేరి మధ్యాహ్నానికి విశాఖపట్నం చేరుకుంటుంది. అక్కడి నుంచి మళ్లీ బయలుదేరి రాత్రికి సికింద్రాబాద్ వస్తుంది. దీనికి నెంబరు కేటాయింపుతోపాటు సమయాన్ని కూడా నిర్థారించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications