ఆలయ అభివృద్ధి: 15 నిమిషాలు చాలన్న వ్యక్తేనా?: అక్బరుద్దీన్పై తస్లీమా నస్రీన్
న్యూఢిల్లీ: ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్పై ప్రముఖ రచయిత తస్లీమా నస్రీన్ విమర్శలు గుప్పించారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాన్ని గుర్తు చేస్తూ.. అక్బరుద్దీన్ ఏమైనా మారిపోయారా? లేక మాస్కు ధరిస్తున్నారా? అని సందేహం వ్యక్తం చేశారు.
ఆలయం అభివృద్ధి కోరుతూ సీఎంను కలిసిన అక్బరుద్దీన్..
హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజలో ఉన్న సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృచేయాలని కోరుతూ సీఎం కేసీఆర్ను ఆదివారం అక్బరుద్దీన్ కలిసిన విషయం తెలిసిందే. మహంకాళి ఆలయ అభివృద్ధి, విస్తరణ కోసం రూ. 10 కోట్లు మంజూరు చేయాలని ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను అక్బరుద్దీన్ కోరారు. అలాగే అఫ్జల్గంజ్ మసీదు అభివృద్ధి కోసం రూ. 3 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
మంచి మనిషిగా మారారా? లేక మాస్కు ధరించారా?
ఈ నేపథ్యంలో తస్లీమా నస్రీన్ ట్విట్టర్ వేదికగా అక్బరుద్దీన్పై విమర్శలు గుప్పించారు. గతంలో 15 నిమిషాలపాటు పోలీసులను తొలగిస్తే దేశంలోని హిందులందరినీ చంపేస్తామంటూ వ్యాఖ్యానించిన అక్బరుద్దీన్.. హిందూ ఆలయ అభివృద్ధి కోసం నిధులు అడుగుతున్నారా? అని సందేహం వ్యక్తం చేశారు. మంచి మనిషిగా మారాడా? లేక మాస్క్ వేసుకున్నారా? అని ప్రశ్నించారు.
15 నిమిషాలు చాలంటూ గతంలో అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు
హిందూ-ముస్లింల జనాభాను సమానం చేయడానికి 15 నిమిషాలపాటు పోలీసులను తొలగిస్తే చాలంటూ 2013లో అక్బురుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 2019లోనూ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సోదరుడు. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షంగా ఎంఐఎం కొనసాగుతున్న విషయం తెలిసిందే. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లను ఎంఐఎంతోపాటు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా వ్యతిరేకిస్తున్నారు. అసెంబ్లీలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం కూడా చేస్తామని కేసీఆర్ ఇటీవల పేర్కొన్నారు.