హైదరాబాద్ చల్లబడింది: పలు ప్రాంతాల్లో శీతల గాలులతో భారీ వర్షం
హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గురువారం పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండలతో విసిగిపోయిన నగరవాసులకు కాస్త ఉపశమనం లభించినట్లయింది. అయితే, కరోనా వ్యాపిస్తున్న వేళ వర్షం కురియడంతో కొంత ఆందోళన కూడా నెలకొంది.
గురువారం సాయంత్రం నుంచి హైదరాబాద్ నగరంలోని నారాయణగూడ, హిమాయత్నగర్, కోఠి, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, సైఫాబాద్, లక్డీకపూల్, బషీర్ బాగ్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు, లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరదనీరు చేరింది.
జేబీఎస్, సికింద్రాబాద్, బోయిన్పల్లి, మారేడ్ పల్లి, తిరుమలగిరి, కార్ఖానా, ప్యాట్నీ, చిలకలగూడా, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, మల్కాజిగిరి, కుషాయిగూడ, నాగారం, దమ్మాయిగూడా, చర్లపల్లి, అంబర్ పేట, కాచిగూడ, కార్వాన్, లంగర్ హౌస్, గుడిమల్కాపూర్, మెహదీపట్నం ప్రాంతాల్లో కూడా ఓ మోస్తారు వర్షం కురిసింది.
విద్యానగర్, రాంనగర్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లి, బోలక్పూర్, పాతబస్తీలోని చాంద్రయణగుట్ట, ఫలక్నుమా, బార్కాస్, ఉప్పుగూడా తదితర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. వర్షం కురియడంతోపాటు చలిగాలులు కూడా వీశాయి. దీంతో నగరం ఒక్కసారిగా చల్లబడిపోయింది.
సాధారణంగా నగరంలో వర్షం కురిస్తే భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యేది. కానీ, కరోనా లాక్డౌన్ కారణంగా ఎవరి ఇళ్లల్లోనే వారు ఉండటం ఎక్కడా అలాంటి దృశ్యం కనపడలేదు. అయితే, కరోనావైరస్ చల్లటి వాతావరణంలో ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉండటంతో నగరవాసులు కొంత ఆందోళన చెందుతున్నారు. కాగా, తెలంగాణలో మరో రెండ్రోజులపాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.