జీహెచ్ఎంసీపై హైకోర్టు ఆగ్రహం.. ఆ ఆక్రమణలపై చర్యలేవీ.. ఎందుకు పట్టించుకోవట్లేదు..
'ఫుట్పాత్లు ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకోవట్లేదు... పాదాచారులు గాల్లో నడవాలా...' అంటూ తెలంగాణ హైకోర్టు జీహెచ్ఎంసీని ప్రశ్నించింది. నగరంలో చాలాచోట్ల ఫుట్పాత్లు ఆక్రమణలకు గురవుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫుట్పాత్ ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఆదేశాలిచ్చింది. అలాగే గతంలో ఫుట్పాత్ ఆక్రమణలపై తీసుకున్న చర్యలను వివరిస్తూ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. న్యాయవాది మామిడాల తిరుమల రావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
గతంలో ఉన్న ఫుట్పాత్లను తొలగించినట్లు జీహెచ్ఎంసీ దృష్టికి వస్తే... తిరిగి అక్కడ ఫుట్పాత్ల నిర్మాణం చేపట్టాలని సూచించింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో పాదాచారులు రోడ్లపై నడుస్తున్నారని... దాంతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తిరుమలరావు తన పిటిషన్లో పేర్కొన్నారు. పైగా పాదాచారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంటున్నారని కోర్టుకు తెలిపారు.ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ మార్గదర్శకాల ప్రకారం నగరంలో ఫుట్పాత్ల నిర్మాణం చేపట్టాలని ఎన్నిసార్లు జీహెచ్ఎంసీకి విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.

ఈ పిటిషన్లో న్యాయవాది తిరుమలరావు నగర పోలీస్ కమిషనర్ను ప్రతివాదిగా చేర్చారు. దీనిపై న్యాయస్థానం ప్రశ్నించగా... కమిషనర్ కార్యాలయంతో పాటు నగరంలోని పోలీస్ స్టేషన్ల ఎదురుగా అడ్డగోలుగా వాహనాలను పార్క్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని తిరుమలరావు పేర్కొన్నారు.
రోడ్ల విస్తరణలో భాగంగా ఫుట్పాత్లు తొలగిస్తున్నారని... 1990ల్లో 10 ఫీట్ల వెడల్పుతో ఉన్న ఫుట్పాత్లు ఇప్పుడు 5 ఫీట్లకు కుచించుకుపోయాయని తెలిపారు.నగరంలో చేపట్టిన మెట్రో నిర్మాణంలో భాగంగా నగరంలో చాలాచోట్ల ఫుట్పాత్లను తొలగించారని అన్నారు. కొన్నిచోట్ల ఫుట్పాత్లను చిరు వ్యాపారులు ఆక్రమించుకుంటున్నారని... దీంతో పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ చిరువ్యాపారులకు ప్రత్యేక ప్రదేశాలను కేటాయించలేదా అని ప్రశ్నించింది. కోర్టు ప్రశ్నకు బదులిచ్చిన ప్రభుత్వ న్యాయవాది కొన్ని ప్రదేశాల్లో కేటాయించామని చెప్పారు.
చివరగా,ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించి గతంలో తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని కోరింది. తదుపరి విచారణను ఏప్రిల్ 15కి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications