గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్: 10 మంది సీనియర్ మెడికోలు ఏడాదిపాటు సస్పెండ్
హైదరాబాద్: నగరంలోని గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేసిన 10 మంది సీనియర్ మెడికోలు ఏడాదిపాటు సస్పెండ్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులు పది రోజుల క్రితం జాన్ అయ్యారు. వీరిపై కొద్ది రోజులుగా 2021, 2022 బ్యాంచ్లకు చెందిన 10 మంది సీనియర్ విద్యార్థులు రోజూ హాస్టల్లో ర్యాగింగ్ చేస్తూ వేధించారు.
ఈ క్రమంలో సీనియర్ల వేధింపులు భరించలేక బాధిత విద్యార్థులు ఢిల్లీలోని యూజీసీ యాంటీ ర్యాగింగ్ సెల్కు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి యాంటీ ర్యాగింగ్ సెల్ అధికారులు ర్యాగింగ్ గురించి గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, డీఎంఈ రమేష్ రెడ్డికి మెయిల్, ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చారు.

ఈనేపథ్యంలో గాంధీ మెడికల్ కాలేజీ యాంటీ ర్యాగింగ్ కమిటీ బాధిత విద్యార్థులతో ర్యాగింగ్కు పాల్పడిన సీనియర్ మెడికోలను పిలిపించి సోమవారం విచారణ జరిపింది. విచారణలో సీనియర్లు ర్యాగింగ్కు పాల్పడినట్లు తేలడంతో 2021 బ్యాచ్కు ఐదుగురిని, 2022 బ్యాచ్కు చెందిన ఐదుగురిని ఏడాదిపాటు సస్పెండ్ చేసినట్లు డీఎంఈ రమేష్ రెడ్డి తెలిపారు.
గత సంవత్సరం కూడా జూనియర్లను ర్యాగింగ్ చేసిన 15 మంది సీనియర్ విద్యార్థులను మూడు నెలలపాటు సస్పెండ్ చేశారు. మెడికల్ కాలేజీల్లో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని, ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎంఈ హెచ్చరించారు. ర్యాగింగ్ను సహించేది లేదని డీఎంఈ స్పష్టం చేశారు.
ఏ మెడికల్ కాలేజీల్లోనూ ర్యాగింగ్ను సహించబోమని కొద్ది రోజుల క్రితం ఆరోగ్య అధికారులు పలువురు సీనియర్ వైద్య విద్యార్థులను గట్టిగా హెచ్చరించారు. "ఏ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ను సహించబోమని చాలా గట్టిగా చెబుతున్నప్పటికీ, సికింద్రాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజీ హాస్టల్లో కొంతమంది సీనియర్ విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్కు పాల్పడ్డారు. దీనిపై చర్యలు తీసుకోవాలని న్యూఢిల్లీలోని యూజీసీ యాంటీ ర్యాగింగ్ సెల్ నుంచి ఫిర్యాదు కూడా అందినట్లు డాక్టర్ రమేష్ రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications