విషాదం: చిక్కడపల్లిలో తుపాకీతో కాల్చుకుని న్యాయవాది ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని చిక్కడపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. బాగ్ లింగంపల్లికి చెందిన న్యాయవాది శివారెడ్డి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో వాయుసేనలో పనిచేసి పదవీ విరమణ చేసిన శివారెడ్డి ప్రస్తుతం న్యాయవాదిగా పనిచేస్తున్నారు. కాగా, శుక్రవారం ఉదయం 6 గంటలకు కడప నుంచి హైదరాబాద్ వచ్చారు. ఇంట్లోకి వెళ్లి గడియ వేసుకుని తిరిగి బయటకు రాలేదు.
బంధువులు ఫోన్ చేసినా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చిన బంధువులు శివారెడ్డి ఇంటికి చేరుకుని తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అయితే, అప్పటికే రక్తపు మడుగులో విగతజీవిగా పడివున్నారు శివారెడ్డి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తన లైసెన్స్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, న్యాయవాది శివారెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.