హైదరాబాద్లో దారుణం: అర్ధరాత్రి నడిరోడ్డుపై అన్నను చంపేశాడు, అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్: ఇటీవల కాలంలో మానవ సంబంధాలు మరీ క్షీణించిపోతున్నాయి. ఆస్తుల కోసం సొంతవాళ్ల ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదు. తాజాగా, హైదరాబాద్ నగరంలో ఆస్తి కోసం సొంత అన్ననే నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశాడు. మంగళవారం రాత్రి 11.30గంటలకు గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్పేటలో చోటు చేసుకుంది.
tiktok: కంత్రి భార్య, 300 టిక్ టాక్ వీడియోలతో అక్రమ సంబంధాలు, బెడ్ రూమ్ లో స్పాట్ లో లేపేసిన భర్త !
అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బాధితుడు విజయ్ కుమార్(41) మణికొండ సెక్రటేరియట్ కాలనీలో చేపలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. షేక్పేట డివిజన్ టీఆర్ఎస్ నాయకుడిగా కూడా ఉన్నాడు. అతడి తమ్ముళ్లు రవి, సంతోష్, నరేందర్ అలియాస్ చిన్నాకు ఆస్తి విషయంలో కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం నిందితుడు నరేందర్ ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. నాటి నుంచి అన్న విజయ్ పై కోపం పెంచుకున్నాడు.
అన్న ప్రాణంపోయేదాక కొట్టాడు
ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి షేక్పేట నాలా వద్ద విజయ్, నరేందర్ ఎదురుపడ్డారు. మద్యం మత్తులో ఉన్న నరేందర్ ఆస్తి కావాలంటూ అన్నను కోరాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి కర్రలతో కొట్టుకున్నారు. ఇంతలో చెరుకు రసం విక్రయించే ఓ మహిళ విజయ్ చేతిలోని కర్రను లాగేసుకుంది. దీంతో నరేందర్ తన చేతిలోని కర్రతో తలపై బలంగా కొట్టడంతో విజయ్ కిందపడిపోయాడు. ఆ తర్వాత కూడా నరేందర్ అతడి తలపై కొడుతూనే ఉన్నాడు. దీంతో చివరకు అక్కడే విజయ్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత నరేందర్ బీహెచ్ఈఎల్లో ఉన్న తమ చిన్నాన్నలు రాజు, విష్ణు వద్దకు వెళ్లిపోయాడు.
ఆస్తి ఇవ్వకపోవడం, పంచకపోవడంతోనే..
కాగా, ఈ ఘటనను అక్కడేవున్న కొందరు తమ ఫోన్లలో వీడియోలు తీశారు. ఘటనకు సంబంధించిన సమాచారం అందడంతో పోలీసులు.. అక్కడికి చేరుకుని విజయ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే నిందితుడు నరేందర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఆస్తి విషయంలో విజయ్ పై ముగ్గురు సోదరులకు ఆగ్రహం ఉందని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రుల ఆస్తిని పంపకాలు చేసుకోవాలంటూ నరేందర్, రవి, సంతోష్ అడుగుతున్నా.. విజయ్ వినడం లేదనే కోపంతో ఉన్నారని చెప్పారు. ఏటీఎం కార్డు విషయంలో విజయ్ తనను కొట్టించాడని అతని సోదరుడు రవి మూడేళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వినాయక్నగర్లో తల్లి పేరుతో ఉన్న ఆస్తిని రూ. 13 లక్షలకు విక్రయించి తమకేమీ ఇవ్వలేదనే కక్ష పెంచుకున్న నరేందర్.. అన్నను హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యప్తు చేస్తున్నారు. హత్య కేసులో ఇంకెవరి ప్రమేయం ఉందనే కోణంలో విచారణ జరుపుతున్నారు.