చార్మినార్ తోపాటు పలుచోట్ల ముస్లింల నిరసనలు: నుపుర్ శర్మను అరెస్ట్ చేయాలంటూ ఆందోళనలు
హైదరాబాద్: మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ నేతలు నుపూర్ శర్మ, నవీన్ జిందాల్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ.. నరగంలోని పలు చోట్ల ముస్లింలు నిరసనలు చేపట్టారు. నగరంలోని పలు మసీదుల్లో మధ్యాహ్నం ప్రార్థన అనంతరం.. ముస్లింలు ఆందోళనకు దిగారు. నుపుర్ శర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వివాదాస్పద వ్యాఖ్యలతో తమ మనోభావాలను దెబ్బతీసినందుకు నుపుర్ శర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.హైదరాబాద్ పాతబస్తీ మక్కామసీద్లో నమాజ్ ప్రార్థనల అనంతరం చార్మినార్ వద్ద పెద్ద ఎత్తున ముస్లిం యువకులు నిరసన తెలిపారు. నుపుర్ శర్మ, నవీన్ జిందాల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు వ్యతిరేకంగా కూడా కొందరు నినాదాలు చేశారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా గట్టి భద్రత చర్యలు చేపట్టారు. పోలీస్ ఉన్నతాధికారులు చార్మినార్ వద్దే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. అయినప్పటికీ, ప్రార్థన అనంతరం.. ముస్లింలు పెద్దఎత్తున రావటంతో కాసేపు ఆందోళన వాతావరణం నెలకొంది.
నిరసనకారులను పోలీసులు అక్కడి నుంచి చెదరగొట్టారు. మెహదీపట్నం కూడలి వద్ద ఉన్న అజీజియా మసీదు వద్ద కూడా.. ముస్లింలు పెద్దఎత్తున ఆందోళన చేశారు. ఆందోళనకారులు రోడ్డుపైకి రావటంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది.
Protests at Charminar,#Hyderabad after Jumma Prayers #إلا_رسول_الله_يامودى#غضبه_المليار_لرسول_اللهpic.twitter.com/K1UVrAwnSx
— ابو سارہ (@007AbuSarah) June 10, 2022
కాగా, హైదరాబాద్ తోపాటు దేశంలోని పలు నగరాల్లోనూ శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లింలు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ లను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పలుచోట్ల వారి ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.