17న ప్రగతి భవన్ ఎదుట దీక్ష.. అపాయింట్మెంట్ ఇవ్వకుంటే నిరసనే..: జగ్గారెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెండ్ జగ్గారెడ్డి.. సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ఇచ్చిన హామీల అమలు కోసం ఈ నెల 17న సీఎం కేసీఆర్ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరుతున్నానని తెలిపారు. సీఎం అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అదేరోజు ప్రగతి భవన్ ఎదుట దీక్షకు దిగుతానన్నారు. ఎన్నికల సందర్భగా టీఆర్ఎస్ ఇచ్చిన ముఖ్యమైన 4 హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Recommended Video
రూ.3016 ఫించన్
57 ఏళ్లకే రూ. 3016 చొప్పున ఇస్తామనే పింఛన్, నిరుద్యోగులకు రూ.3016 భృతి, రైతులకు ఒకే విడతలో రూ.లక్ష రుణమాఫీ, మహిళా గ్రూపులకు వడ్డీలేని రుణాల మంజూరు హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామపంచాయతీల్లో, రాష్ట్రంలోని ఇతర గ్రామపంచాయతీల్లోనూ అక్రమ లేఅవుట్లకు ఎల్ఆర్ఎ్సను ప్రకటించి.. క్రమబద్ధీకరించాలని కోరారు. గ్రామపంచాయతీల్లో అనుమతి లేకుండా నిర్మాణం జరిపిన భవనాలకు బీఆర్ఎ్సను ప్రకటించి క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగాల ఊసేలేదు..
వైద్యం కోసం ఆరోగ్యశ్రీని, చదువు కోసం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని, యువతకు ఉద్యోగాలూ తమ పార్టీ హయాంలోనే ఎక్కువగా వచ్చాయని జగ్గారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక భర్తీ చేసిన ఉద్యోగాలు చాలా తక్కువ అని, ఉమ్మడి రాష్ట్రంలో విన్న డిమాండ్లనే ఇప్పుడు కూడా వినాల్సి వస్తోందని అన్నారు. ఇక కానిస్టేబుళ్ల పదోన్నతుల అంశంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు చేయాలని, ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేదవాడికీ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం రూ.10 వేల నుంచి రూ.20 లక్షల వరకు సాయం అందించాలని అన్నారు.
12 శాతం రిజర్వేషన్
ఎస్టీలు, ముస్లిం మైనారిటీలకు హామీ ఇచ్చిన 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. అకాల వర్షాలు, నకిలీ విత్తనాల కారణంగా నష్టపోయిన రైతులకు సబ్సిడీలు కల్పించి ఆదుకోవాలని, పంటలకు గిట్టుబాటు ధర ఇస్తూ అన్ని కొనుగోలు కేంద్రాలు తెరవాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో ఇంటిస్థలం లేని పేదలకు స్థలం ఇవ్వాలని, పట్టణాల్లోని పేదలకు సైతం పక్కనే ఉన్న గ్రామంలో భూమిని కొని ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, కోరారు.
ఇంటిస్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల సాయం చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీల్లోని అన్ని కులాలకు, అగ్రకులాల్లోని పేదవారికీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వడ్డీలేని రుణాలు ఇవ్వాలన్నారు. కౌలు రైతులకు పంటనష్టం జరిగితే పరిహారాన్ని వారికే ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
జీవో 317కి సవరణలు
ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి జారీచేసిన జీవో 317పై కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి సవరణలు చేయాలని జగ్గారెడ్డి అన్నారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సమన్వయం చేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న డిమాండ్లు, బెనిఫిట్లను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.
ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్నారు. పదో తరగతి ఫెయిలైన వారినుంచి పీజీలు చదివిన వారందరికీ ఉద్యోగాలు వచ్చేలా రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు ఏర్పాటు చేయాలని కోరారు. లేదంటే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసి యువత సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు రూ.5 లక్షల సాయం చేయాలని కోరారు.