నో టిక్కెట్: ఇద్దరు ఎంపీలకు కేసీఆర్ షాక్, వారు ఎవరు? కాంగ్రెస్పై కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర లోకసభ ఎన్నికలు, రేపు (మంగళవారం) జరగాల్సిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ఎల్పీ భేటీ జరిగింది. ఈ సందర్భంగా రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ భేటీలో అధినేత మాట్లాడారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో ఒకరిద్దరికి టిక్కెట్లు ఇవ్వమని షాకిచ్చారు.
'హరీష్ రావు ఓ టైమ్ బాంబులాంటివాడు, కేటీఆర్తో సమన్వయం చేయాలని కేసీఆర్ ఆలోచన'
ఒకరిద్దరికి టిక్కెట్ నో
వచ్చే లోకసభ ఎన్నికల్లో పదహారు స్థానాలు మనమే గెలుస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సిట్టింగ్లలో ఒకరిద్దరికి టిక్కెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. వారు పార్టీకి నష్టం చేశారని, అందుకే టిక్కెట్ నిరాకరిస్తున్నామని తెలిపారు. కానీ ఆ ఇద్దరు ఎవరో మాత్రం కేసీఆర్ పేర్లు చెప్పలేదు. పార్టీకి నష్టం చేస్తే ఉపేక్షించేది లేదని చెప్పారు.
కాంగ్రెస్ ఖాళీ అయ్యే పరిస్థితి
కేసీఆర్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడుతూ.. అభ్యర్థిని నిలబెట్టవద్దని కాంగ్రెస్ పార్టీకి చెప్పామని, అయినా వారు నిలబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకోవద్దని తొలుత భావించామని చెప్పారు. ఎమ్మెల్యేలు వరుసగా తెరాసలోకి వస్తున్నారని, త్వరలో కాంగ్రెస్ ఖాళీ అయ్యే పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఈ రోజు ఉదయం కూడా ఓ ఎమ్మెల్యే తనతో మాట్లాడారని చెప్పారు.
కాంగ్రెస్ నుంచి మరో నలుగురైదుగురు
ఈ భేటీ సందర్భంగా కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థులను అందరికీ పరిచయం చేశారు. మాట ప్రకారం యెగ్గెం మల్లేషానికి టిక్కెట్ ఇచ్చామని తెలిపారు. శేరి సుభాష్ రెడ్డికి ఎమ్మెల్సీ సీటు ఆలస్యం అయిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగే ముందు సమగ్రంగా అంచనా వేసుకున్నట్లు తెలిపారు. మన పనితీరు నచ్చి 88 మందిని తెలంగాణ ప్రజలు ఎమ్మెల్యేలుగా గెలిపించారని, మరో ఇద్దరు స్వతంత్రులు పార్టీలోకి వచ్చారన్నారు. అసెంబ్లీలో తెరాస బలం 91కి చేరుకుందన్నారు. మరో నలుగురైదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.