దేశంలో ఎక్కడా లేని పథకాలు అమలు.!ప్రజల సంక్షేమానికే కేసిఆర్ పెద్ద పీఠ.!సీఎంపై మంత్రి ఎర్రబెల్లి ప్రశంసలు
హనుమకొండ/హైదరాబాద్ : కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, గ్రామ స్థాయిలో బిజెపి నేతలు, కార్యకర్తలు ఎన్ని ఆటంకాలు కల్పిచినా, నిధులు ఇవ్వకపోయినా, రాష్ట్రంలో సిఎం చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాలు ఒక యజ్ఞంలా కొనసాగుతూనే ఉంటాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రజాభీష్టానికి పెద్దపీట వేస్తూ, వారి సంక్షేమం, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. అందుకే దేశానికే రాష్ట్రం అదర్శంగా నిలుస్తుందన్నారు. హన్మకొండ జిల్లా, హుస్నాబాద్ నియోజకవర్గం, ఎల్కుతుర్తి మండలం,కేశవపూర్ గ్రామంలో రైతు వేదికను మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి ఆయన ప్రారంబించారు.
కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టిస్తోంది. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాల యజ్ఞం ఆగదన్న ఎర్రబెల్లి
గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, గాంధీజీ మాటలను నిజం చేస్తూ పల్లె ప్రగతి వంటి పథకాలను కల్పించి, సిఎం చంద్రశేఖర్ రావు పల్లెలను సర్వతోముఖంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. దేశంలో 20 అత్యున్నత గ్రామాలను ఎంపిక చేస్తే, అందులో 19 గ్రామాలు తెలంగాణవే ఉన్నాయన్నారు. ఇవ్వాళ తెలంగాణ పల్లెలు దేశానికి పట్టుగొమ్మల్లా నిలిచాయని మంత్రి తెలిపారు. గ్రామాల్లో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, నర్సరీ, సిసి రోడ్లు, మౌలిక వసతులు, పచ్చదనం, పరిశుభ్రత, డంపింగ్ యార్డులు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. దేశంలో ఫైనాన్స్ కమిషన్కు సమానంగా నిధులు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.
అభివృద్ధి, సంక్షేమాల్లో దేశానికే ఆదర్శంగా మన రాష్ట్రం.. కేసీఆర్ గొప్ప దార్శనికుడన్న మంత్రి ఎర్రబెల్లి
దండేపల్లిలో ఆయిల్ ఫామ్ సాగుకు అవసరమైన మొక్కలను పంపణి చేశారు. అలాగే కోతుల నడుమ గ్రామంలో రైతు వేదికను ప్రారంభించారు. భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ లో పంచాయతీరాజ్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అట్లాగే రైతు వేదికను ప్రారంభించారు. అనంతరం ఎల్కతుర్తి మండలం దామెరలో 133/11 కెవి సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. ఆయా సందర్భాల్లో వేర్వేరుగా జరిగిన సభల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, తెలంగాణ అనతి కాలంలోనే దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా రికార్డు సృష్టించిందన్నారు మంత్రి ఎర్రబెల్లి.
ఉచిత విద్యుత్ ఇస్తుంది ఒక్క తెలంగాణ మాత్రమే.. రైతు సమస్యల పట్ల సత్వరం స్పందిస్తామన్న మంత్రి
రైతుల కోసం కాళేశ్వరం, దేవాదుల, ఎస్సారెస్పీ కాలువల ద్వారా సాగునీరు, 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన కోతలు లేని కరెంటు, విత్తనాలు, రుణాల మాఫీ, పంటల పెట్టుబడులు, రైతు బీమా, చివరకు రైతులు ఏ కారణం చేత చనిపోయినా, వారం రోజుల్లోనే ఇంటికి 5 లక్షల రూపాయల చెక్కులు అందచేస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు. ఒక్క రైతు కోసం ఇన్ని చేస్తున్న ప్రభుత్వం రైతు వేదికల ద్వారా రైతులకు పంటలు, వాటి మార్కెటింగ్ వంటి పలు అంశాలు చర్చించుకునే విధంగా రైతు వేదికలు, రైతుల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా రైతు కల్లాలు, చివరకు పంటల కొనుగోలు దాకా రైతుల కోసం పని చేస్తున్న ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదన్నారు మంత్రి ఎర్రబెల్లి.
ప్రత్యామ్నాయ పంటలుగా ఆయిల్ పామ్.. రైతు సంక్షేమమే కేసీఆర్ లక్ష్యమన్న ఎర్రబెల్లి దయాకర్
సీఎం చంద్రశేఖర్ రావు ప్రభుత్వ పథకాల వల్ల మన రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఆగిపోతే, ప్రధాని మోడీ, బిజెపి పాలిత రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ప్రజలు ఇవన్నీ గమనించాలన్నారు. అలాగే, రైతు బాగుపడాలని, రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదనే, రైతుల కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి వారిని వివిధ లాభదాయక వాణిజ్య పంటల సాగు వైపు మళ్ళించిన ఘనత కూడా సిఎం చంద్రశేఖర్ రావుకే దక్కుతుందన్నారు. అందుకే ఆయిల్ పామ్ పంటలను బాగా వేయాలని, ఇందుకు సబ్సిడీని ఇస్తూ, డ్రిప్ ఇరిగేషన్ ను కూడా అందచేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.