కేసీఆర్.. సీఏఏతో ఎవరికి అన్యాయం?: కిషన్ రెడ్డి, ఫ్యామిలీ కోసం కాదంటూ చురకలు
హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లను తాము వ్యతిరేకిస్తున్నామంటూ ప్రకటించిన తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన సంత్ రవిదాస్ 621వ జయంతి వేడుకల్లో కిషన్ రెడ్డితోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంత్ రవిదాస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు.

ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను కేసీఆర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఏఏతో దేశ పౌరులకు జరుగుతున్న అన్యాయమేంటో కేసీఆర్ చెప్పాలని నిలదీశారు. శరణార్థులకే పౌరసత్వం ఇస్తామని, చొరబాటుదారులకు కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

పౌరసత్వం అక్రమ చొరబాటుదారులకు కాదు..
శరణార్థులు వేరు.. అక్రమ చొరబాటుదారులు వేరనే విషయం కేసీఆర్ తెలుసుకోవాలన్నారు. పాకిస్థాన్ పౌరుల కోసం సీఏఏను వ్యతిరేకిస్తున్నారా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో మతపరమైన వివక్షను, హింసను ఎదుర్కొని మనదేశానికి శరణార్థులుగా వచ్చిన హిందువులు, బౌద్ధులు, సిక్కులు, క్రిస్టియన్లకు పౌరసత్వం కల్పించేందుకే సీఏఏను తీసుకొచ్చామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

కుటుంబాల కోసం బీజేపీ పనిచేయదు..
కుటుంబాల కోసం బీజేపీ పనిచేయడం లేదని, దేశం కోసం పనిచేస్తుందని కేసీఆర్కు కిషన్ రెడ్డి చురకలంటించారు. ఎంఐఎం మెప్పుకోసమే ఇంగిత జ్ఞానం లేకుండా జీహెచ్ఎంసీలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడేవారికి కనువిప్పు కలగాలని, సంత్ రవిదాస్ జీవిత చరిత్ర చదివితే వారిలో కొంత మార్పు వస్తుందని అన్నారు. గొప్ప హిందువుగా చెప్పుకుంటూనే హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. సీఏఏ, ఎన్ఆర్సీలను తాము వ్యతిరేకిస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో శనివారం జీహెచ్ఎంసీలో సీఏఏ, ఎన్ఆర్సీ వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం జరిగింది. కేసీఆర్ స్ఫూర్తిగానే ఈ తీర్మానం చేసినట్లు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications