కరీంనగర్ సెంటిమెంట్గా TRS నామినేషన్.. తొలిరోజు రెండు దాఖలు.. ఆ 3 రోజులు బందే..!
హైదరాబాద్ : లోక్సభ సమరానికి మలి అడుగు పడింది. నామినేషన్ల పర్వం షురూ అయింది. ఇలా నోటిఫికేషన్ విడుదలైందో లేదో అలా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు టీఆర్ఎస్ నుంచి ఒకరు, ఎంఐఎం నుంచి మరొక నేత నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం (18.03.2019) నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు ఎన్నికల అధికారులు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్లు తీసుకోనున్నారు. ఈ నెల 25తో నామినేషన్ల తంతు ముగియనుంది. 26వ తేదీన నామినేషన్లు పరిశీలించి.. 27, 28 తేదీల్లో ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు.
సెంటిమెంట్ నామినేషన్
లోక్సభ ఎన్నికల సమరం ఊపందుకుంటోంది. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా తొలిరోజు కరీంనగర్ పార్లమెంటరీ స్థానానికి టీఆర్ఎస్ తరపున బి.వినోద్ కుమార్ నామినేషన్ వేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆయన వెంట మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్ ఉన్నారు.
టీఆర్ఎస్ కు కలిసొచ్చిన కరీంనగర్ సెంటిమెంట్ గా వినోద్ కుమార్ చేత తొలి నామినేషన్ వేయించినట్లు తెలుస్తోంది. 16 స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో ఉన్న గులాబీ పెద్దల ఆదేశాల మేరకు.. కరీంనగర్ లో టీఆర్ఎస్ మొదటి నామినేషన్ వేయించినట్లు సమాచారం.
ఉదర్ టీఆర్ఎస్.. ఇదర్ ఎంఐఎం
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తన నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ లోక్సభ స్థానంలో మజ్లిస్ పార్టీ తరపున ఆయన బరిలో నిలుస్తున్నారు. రిటర్నింగ్ అధికారి కలెక్టర్ మాణిక్రాజ్ కన్నన్కు తన నామినేషన్ పత్రాలు అందించారు. ఆయన వెంట ఎంఐఎం లీడర్లు, కార్యకర్తలు తరలివచ్చారు. 2009, 2014లో హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్ నుంచి ఎంఐఎం తరపున పోటీచేసి గెలుపొందారు అసదుద్దీన్.
ఆ 3 రోజులు బంద్..!
లోక్సభ ఎన్నికల నగారా మోగడంతో నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు ఆయా పార్టీల అభ్యర్థులు. ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు గడువున్నా.. అందులో 3 రోజులు నామినేషన్లు స్వీకరించబోమని తెలిపారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్. 21వ తేదీ హోలీ, 23వ తేదీ నాలుగో శనివారం, 24వ తేదీ ఆదివారం రావడంతో.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ 3 రోజుల్లో నామినేషన్లు స్వీకరించబోమని స్పష్టం చేశారు.
నామినేషన్ పత్రాల్లో వివరాలు సరిగా నింపకపోతే.. అలాంటివాటిని తిరస్కరిస్తామని తెలిపారు రజత్ కుమార్. విదేశీ ఆస్తుల వివరాలు సైతం అఫిడవిట్ లో పొందుపరచాలని సూచించారు. సమస్యాత్మక నియోజకవర్గాల్లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఎన్నికల ప్రచారానికి విద్యార్థులను వాడుకోవద్దని సూచించారు.