లక్ష కాదు యాభై వేలే.. ప్రముఖులే టార్గెట్.. ఫ్యాన్సీ నెంబర్లు ఇప్పిస్తానంటూ..!
హైదరాబాద్ : చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్న చందంగా పెద్ద పెద్దోళ్లను బురిడీ కొట్టించాడు ఓ యువకుడు. మాయమాటలు చెప్పి అందినకాడికి దోచుకున్నాడు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీఐపీలు టార్గెట్గా స్కెచ్ వేసి వలలో వేసుకున్నాడు. మారుపేర్లతో చలామణీ అవుతూ మాయ చేశాడు. ఫ్యాన్సీ మొబైల్ నెంబర్లు ఇస్తానంటూ మాటలు కలిపి నిండా ముంచేశాడు. పెద్దోళ్లను ఇలా ముంచితే పోలీసులకు ఫిర్యాదు చేయబోరనేది అతగాడి నమ్మకం. అయితే చివరకు సీన్ రివర్స్ అయింది.. ప్లాన్ బెడిసి కొట్టింది. ఓ పెద్దాయన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు యువకుడిని అరెస్ట్ చేశారు.
బీటెక్ మధ్యలోనే ఆపేసి.. నేరాల బాట
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన 28 సంవత్సరాల దీపు బాబు అనే యువకుడు చదువు ఒంటబట్టక బీటెక్ ఇంజినీరింగ్ మధ్యలోనే వదిలేశాడు. ఆ క్రమంలో నేరాలను తన వృత్తిగా ఎంచుకున్నాడు. అయితే పెద్ద పెద్దోళ్ల జోలికి పోతే వాళ్లు పోలీసులకు కంప్లైంట్ చేయలేరని భావించి కొత్త స్కెచ్ వేశాడు. ఫ్యాన్సీ మొబైల్ నెంబర్లు ఇస్తానంటూ నయా రూట్ ఎంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రముఖులే టార్గెట్గా తక్కువ ధరకు ఫ్యాన్సీ నెంబర్లంటూ గాలం వేశాడు. తన వలలో చిక్కిన ఎందరినో నిండా ముంచేశాడు.
ఆర్టీసీ సమ్మె చట్టబద్ధం కాదా.. ఉద్యమంలో మీ జాడేది.. ఆ ముగ్గురు మంత్రులపై రేవంత్ చిందులు..!
అంతా వీఐపీలే టార్గెట్.. తక్కువ ధరకు ఫ్యాన్సీ నెంబర్లు అంటూ..!
ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఇంకా ఇతరత్రా ప్రముఖులు దీపు బాబు టార్గెట్. ఆ క్రమంలో అలాంటి వారి ఫోన్ నెంబర్లు సేకరించి తక్కువ ధరకు ఫ్యాన్సీ నెంబర్లు ఇప్పిస్తానంటూ ఓ ఆకర్షణీయమైన మేసేజ్ పంపించేవాడు. అతడు పంపించిన మేసేజ్లో చూసిన ఫ్యాన్సీ ఫోన్ నెంబర్లు చూసి సహజంగానే కొందరు అట్రాక్ట్ అయ్యేవారు. దాంతో ఫలానా నెంబర్ కావాలంటూ ఇతగాడిని కాంటాక్ట్ చేసేవారు. ఆ సమయంలో తనకు తానుగా ఓ మొబైల్ సంస్థ సీఈవోను అంటూ పరిచయం చేసుకునేవాడు. అలా బుట్టలో పడ్డ వారి నుంచి అదే అదనుగా అందినకాడికి దండుకునేవాడు.
కాంటాక్ట్ చేస్తే చాలు.. మాయమాటలతో బురిడీ
మొదట మేసేజ్లు పంపించడం.. అలా ఎవరైనా కాంటాక్ట్ ఐతే మోసగించడం.. ఇదే పనిగా పెట్టుకున్నాడు దీపు బాబు. ఫలానా ఫ్యాన్సీ నెంబర్ కావాలంటూ అవతలి వారు అడగడమే తరువాయి.. ఆ నెంబర్కు చాలా డిమాండ్ ఉందని నమ్మించేవాడు. అలా మాట్లాడుతూనే మీరు తీసుకుంటారా లేదా తొందరగా చెప్పాలంటూ వారిని కంగారు పెట్టేవాడు. ఆ క్రమంలో వారు ఓకే చెప్పగానే అసలు విషయం చెప్పేవాడు. వాస్తవానికి అది లక్ష రూపాయలు పలుకుతోందని.. మీకు కావాలంటే 40 వేలకో, యాభై వేలకో ఇప్పిస్తానంటూ నమ్మించేవాడు. అతగాడి మాటలు నమ్మి చెప్పిన బ్యాంక్ అకౌంట్కు డబ్బులు పంపించేవారు. అలా చాలామందిని మోసం చేసి జల్సాలు చేస్తున్నాడు దీపు బాబు.
బోగస్ పేర్లతో సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాలు
బీటెక్ చదవడం మధ్యలోనే ఆపేసిన దీపు బాబు మోసాలు చేయడమే వృత్తిగా మలచుకున్నాడు. ఆ క్రమంలో బోగస్ పేర్లతో కొన్ని సిమ్ కార్డులు తీసుకోవడంతో పాటు బ్యాంకు ఖాతాలు తెరిచాడు. అంతేకాదు గోపాల్, ప్రతాప్రెడ్డి, విఠల్ అనే మారు పేర్లతో చలామణీ అయ్యేవాడు. ఇంటర్నెట్ సాయంతో పలువురి ప్రముఖుల నెంబర్లు తీసుకుని ఈ మోసాలకు తెర లేపాడు. డీల్ కుదిరి బ్యాంకు ఖాతాలో డబ్బులు పడ్డాక వెంటనే అలర్ట్ అయ్యేవాడు. సదరు ఫోన్ నెంబర్కు సంబంధించిన సిమ్ కార్డును ధ్వంసం చేసేవాడు. ఇతడి చేతిలో చాలామంది మోసపోయినట్లు తెలుస్తోంది. చివరకు ఓ పెద్దాయన ఫిర్యాదుతో దీపు బాబు గుట్టు రట్టు చేశారు పోలీసులు.
ఆర్టీసీ సమ్మె వెనుక గులాబీ నేతలు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
బెంగళూరులో మకాం.. జల్సాల జీవితం
ఇదివరకు ఆంధ్రప్రదేశ్ లోని చీరాల, గుంటూరు పోలీసులు దీపు బాబును అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత తన మకాంను బెంగళూరుకు మార్చాడు. ప్రముఖులకు ఫ్యాన్సీ నెంబర్లు ఉన్నాయంటూ మేసేజ్లు పంపించడం.. బుట్టలో పడ్డ వారిని మోసగించడం.. డబ్బులు దండుకోవడం.. జల్సాలు చేయడం.. ఇదే అతడి వృత్తిగా మారిపోయింది. ఇలా మోసం చేస్తూ పోగేసిన డబ్బులతో గుర్రం రేసుల్లో పందాలు కాసేవాడని తెలుస్తోంది. మొత్తానికి దీపు బాబును సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఈ మోసాల చిట్టా వెలుగు చూసింది.