కమల దళంపై రెచ్చిపోండి, కార్యకర్తలకు కేటీఆర్ పిలుపు
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్- బీజేపీ మధ్య కౌంటర్ అటాక్ జరుగుతోంది. బండి సంజయ్ కామెంట్లకు సీఎం కేసీఆర్ గట్టిగానే స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో టీఆర్ఎస్ కార్యకర్తలు విజృంభించాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. బీజేపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వమే వరి కొనుగోలు చేయాలని ఈనెల 12వ తేదీన ఆందోళనలు నిర్వహిస్తామని వివరించారు. బీజేపీ మెడలు వంచేలా ధర్నా చేయాలని సూచించారు.
కామారెడ్డిలో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి కేటీఆర్ హజరయ్యారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన, సంస్కరణలు, సంక్షేమం, అభివృద్ధి పనుల్లో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని చెప్పారు. తెలంగాణ పథకాలను బీజేపీ కాపీ కొడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు బీజేపీ నేతలకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు.
వరిధాన్యం కొనలేమని కేంద్రమే రాష్ట్రాలకు లేఖ రాసిందని తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేసీఆర్ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని వివరించారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ వంటి ప్రధాన పార్టీలను గట్టిగా ఎదుర్కొన్న ఘనత ఆయనదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని వివరించారు.60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ నాయకులు ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. వారేం చేయలేదని గుర్తుచేశారు. కానీ ప్రభుత్వంపై మాత్రం విమర్శలు చేస్తారని ఫైరయ్యారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆ పార్టీ కారణం కాదా అని అడిగారు.
కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు, కరెంట్ షాక్లు, రైతు ఆత్మహత్యలు ఉండేవని దుయ్యబట్టారు. కామారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు తరలిస్తాం అని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఆసరా పింఛన్లు 10 రేట్లు పెంచామని గుర్తుచేశారు. బీడీ కార్మికులు, ఒంటరి మహిళకు దేశంలో తొలిసారిగా పింఛన్లు ఇస్తున్నామని కేటీఆర్ చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎందుకు ఇవ్వడం లేదని అడిగారు. పైకి సుద్దులు మాత్రం చెబుతారని ఆయన పేర్కొన్నారు. చేతలు మాత్రం ఉండవని.. ఇవీ అందరికీ తెలుసు అని వివరించారు.