వర్షాలతో అలర్ట్: మంత్రులు, అధికారులకు సీఎం కేసీఆర్ నిర్దేశం.. నిర్మల్లో
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షం కురుస్తోంది. ఎస్సారెస్పీ ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగుతుండటంతో తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులను, నేతలను సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. బాల్కొండ నియోజక వర్గం, నిజాబాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో నేపథ్యలో తక్షణమే పర్యవేక్షించాలని ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని ఆదేశించారు.
నీట మునిగిన నిర్మల్..
వర్షాలతో ఇప్పటికే నిర్మల్ నీటి మునిగింది. అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తక్షణమే పంపాలని సీఎస్ సోమేశ్ కుమార్ను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని గోదావరి పరీవాహక ప్రాంత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ అధికారులు, ఆర్అండ్బీ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలందరూ ఇళ్లలోంచి బయటకు రావద్దని సూచించారు.
అలర్ట్..
వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. గోదావరితోపాటు కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో.. రాష్ట్రంతో పాటుఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆయా రాష్ట్రాలకు చెందినవారు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తుతున్నారని వివరించారు. తెలంగాణలో వరద ఉధృతి పెరగనుంది. గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లోని మంత్రులు , ఎమ్మెల్యేలు.. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తూ ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
అందుబాటులో ఉండండి..
ఆయా ప్రాంతాల అన్నిస్థాయిల టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తెలంగాణ భవన్కు అందుబాటులో ఉంటూ పరిస్థితులను సమీక్షిస్తుండాలని కోరారు. ఈ ప్రాంతాల్లో గల ప్రజలు కూడా బయటకు వెళ్లకుండా ఇండ్లలో ఉండడమే క్షేమకరమని సీఎం పేర్కొన్నారు. వచ్చే రెండు రోజులు అత్యంత భారీ స్థాయిలో వర్షాలు కురిసే పరిస్థితుల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉంటూ.. ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉంటూ తగు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
సహాయక చర్యలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అధికారులు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. నిర్మల్లో గల మంజూలా పూర్, మంచిర్యాల చౌరస్తా, సిద్దాపూర్, సోఫీ నగర్ కాలనీలను మంత్రి పరిశీలించారు. జోరు వానలో పలు కాలనీలలో పర్యటిస్తూ అధికారులకు సూచనలు చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రజలకు భరోసా కల్పించారు. కాలనీ వాసులతో వారి సమస్యలపై చర్చించారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
Recommended Video
ఎన్నడూ ఇలా లేదు
నిర్మల్ చరిత్రలో గతంలో ఎన్నడూ కూడా ఇంతటి వర్షం కురవలేదన్నారు. పలు కాలనీలు జలమయ్యాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. నిత్యావసరాలు, తాగు నీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. స్థానిక ప్రజలు కూడా బాధితులకు సహాయం చేయాలని కోరారు. తర్వాత జిల్లా అధికారులతో కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్షించారు.వర్షం ఇలాగే కురిస్తే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, వర్షాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు ముందస్తు చర్చలు చేపట్టాలన్నారు. వర్ష ప్రభావిత అన్ని గ్రామాలు, పట్టణాల నుంచి ఎప్పటికప్పుడు నివేదిక తెప్పించుకుని, పరిస్థితిని బట్టి చర్యలు తీసుకోవాలని చెప్పారు.