కొత్త విద్యుత్ చట్టం పెద్ద డేంజర్... సమాఖ్య స్పూర్తిని గొడ్డలితో అడ్డంగా నరకడమే...
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త విద్యుత్ చట్టం రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని,సమాఖ్య స్పూర్తిని గొడ్డలితో అడ్డంగా నరికేసే చట్టమని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఇది అత్యంత ఘోరాతి ఘోరమైన చట్టమైన... దీనివల్ల చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉందని అన్నారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ముసాయిదా బిల్లు పంపించారని... అందుకే దాన్ని వ్యతిరేకిస్తూ తాను కేంద్రానికి లేఖ కూడా రాశానని చెప్పారు. రేపో మాపో పార్లమెంటులోనూ ఈ బిల్లు చర్చకు పెట్టే అవకాశం ఉందన్నారు. విద్యుత్ సమస్యలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడారు.

ఇక లోడ్ డిస్పాచ్ సెంటర్ కూడా ఢిల్లీకే...
కాంగ్రెస్,బీజేపీ ప్రభుత్వాలు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను పదేపదే ఉల్లంఘిస్తున్నాయని సీఎం కేసీఆర్ ఆరోపించారు. కేంద్రంలో ఎవరున్నా క్రమంగా అధికారాలను కిందకు బదిలీ చేయాల్సిందిపోయి...రాష్ట్రాల హక్కులను హరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని అధికారాలను కేంద్రం వద్దే ఏకీకృతం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. కొత్త విద్యుత్ చట్టం అమలైతే హైదరాబాద్లో లోడ్ డిస్పాచ్ సెంటర్ కూడా ఉండదని... దాన్ని కూడా ఢిల్లీకి మారుస్తారని చెప్పారు. అప్పుడు ఏ విద్యుత్ సమస్య వచ్చినా ఢిల్లీ అధికారుల గడ్డం పట్టుకునే పరిస్థితి వస్తుందన్నారు.

ప్రైవేట్కు మేలు... రాష్ట్రాలకు అన్యాయం..
కొత్త విద్యుత్ చట్టం అమలులోకి వస్తే ఎవరు ఎక్కడినుంచైనా విద్యుత్ కొనుక్కోవచ్చునని... అలాంటప్పుడు రాష్ట్రాల పరిధిలోని డిస్కంలు,ట్రాన్స్కోలు,అందులోని ఉద్యోగుల పరిస్థితి ఏంటని కేసీఆర్ ప్రశ్నించారు. కనీసం ప్రజలకు సబ్సిడీ ఇచ్చే అవకాశం కూడా ఉండదన్నారు. ఈ చట్టంలో నాగార్జునసాగర్,శ్రీశైలం వంటి జల విద్యుత్ కేంద్రాలను అసలు లెక్కలోకే తీసుకోలేదన్నారు. అంటే,ఎక్కడో ఉత్తరభారతదేశంలో విద్యుత్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేవారికి మేలు చేయడం కోసం... సొంత రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యుత్ కేంద్రాలను మూసివేసుకునే పరిస్థితి తలెత్తుతోందన్నారు.

మిగులు విద్యుత్ ఉన్నా....
పైగా కొత్త చట్టం ప్రకారం గ్యారెంటీగా విద్యుత్ కొనుగోళ్లు చేయాలని... లేనిపక్షంలో ఒక యూనిట్కు 50పైసల నుంచి రూ.2 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అన్నారు. అయితే అలా బయటినుంచి కొనుగోలు చేసే పక్షంలో రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ సామర్థ్యాన్ని తగ్గించుకోవాల్సి వస్తుందని... విద్యుత్ కేంద్రాలను మూసివేసే పరిస్థితి కూడా తలెత్తుతుందని చెప్పారు. నిజానికి భారతదేశంలో 4లక్షల మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉందని... దాన్ని దేశానికి ఎలా ఉపయోగించుకోవాలనే ప్రణాళిక కేంద్రం వద్ద లేదని అన్నారు. దేశంలో ఇప్పటికీ కేవలం 2లక్షల 19వేల మెగావాట్లనే ఉపయోగిస్తున్నామని... ఉత్తర భారత్లో ఇప్పటికే ఎన్నో రాష్ట్రాలు విద్యుత్ సమస్యలను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. మిగులు విద్యుత్ ఉంచుకుని కూడా ఇలాంటి దుస్థితిలో ఉండటం దారుణమన్నారు.
Recommended Video

పార్లమెంటులో వ్యతిరేకిస్తాం...
ఏదేమైనా ఈ చట్టం పెద్ద డేంజర్ అని... దీనిపై రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే,ఎంపీలు కూడా ప్రజలకు వాస్తవాలు చెప్పాలని కేసీఆర్ అన్నారు. ఇప్పటివరకూ ఈఆర్సీ నియామకం రాష్ట్రాల చేతిలో ఉందని... కొత్త చట్టంతో అది కూడా హరించుకుపోతుందని అన్నారు. కాబట్టి ఈ చట్టాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని... పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు వ్యతిరేక స్వరం వినిపిస్తారని చెప్పారు. అంతకుముందు,విద్యుత్ సమస్యలపై తన ప్రసంగాన్ని ప్రారంభించేటప్పుడు ఇటీవల శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ దుర్ఘటనలో మృతులకు కేసీఆర్ శ్రద్దాంజలి ఘటించారు.












Click it and Unblock the Notifications