కేసీఆర్తో లంచ్ మీట్ - ఆప్ ఫార్ములా..!!
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ ప్రవేశించింది. దీనికి సంబంధించిన వేడి రాజుకుంటోంది. వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో- అధికార భారత రాష్ట్ర సమితి ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారిస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గురి పెడుతోంది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి కేసీఆర్ సర్కార్.. అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది.
బీఆర్ఎస్ విస్తరణ..
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. భారత రాష్ట్ర సమితి విస్తరణ మీద దృష్టి సారించారు. దేశ రాజధానిలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఇక- మిగిలిన రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలను విస్తరించడానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్నారు. అటు రాష్ట్రంలో పరిపాలనను పరుగులు తీయిస్తూనే.. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేలా ఆయన నిర్ణయాలు ఉండబోతోన్నాయి.
ఆప్ ఫార్ములా..
బీఆర్ఎస్ విస్తరణ విషయంలో కేసీఆర్.. ఆమ్ ఆద్మీ పార్టీ ఫార్ములాను అనుసరించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఆవిర్భావం అనంతరం తొలుత ఢిల్లీ వరకే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ ఆ తరువాత పంజాబ్లో అధికారాన్ని అందుకున్న విషయం తెలిసిందే. క్రమంగా గుజరాత్, గోవా, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ విస్తృతంగా ఓటుబ్యాంకును పెంచుకోగలిగింది ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ.
అదే తరహాలో..
అదే తరహాలో కేసీఆర్ కూడా తన బీఆర్ఎస్ను విస్తరించడానికి అవకాశాలు ఉన్నాయి. తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాలకూ పార్టీని విస్తరించడంపై దృష్టి సారించారాయన. ఇప్పటికే కర్ణాటకలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలను కేసీఆర్ పరిశీలిస్తోన్నారు. మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి సారథ్యంలోని జనతాదళ్ (సెక్యులర్)తో పొత్తు పెట్టుకోవచ్చనే అభిప్రాయలు ఉన్నాయి.
భగవంత్ మాన్తో..
ఈ క్రమంలో కేసీఆర్.. ఈ మధ్యాహ్నం ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్తో భేటీ కానున్నారు. లంచ్ మీట్లో పాల్గొననున్నారు. పంజాబ్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఇవ్వాళ భగవంత్ మాన్ హైదరాబాద్కు రానున్నారు. ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో పాల్గొంటారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలు, తమ ప్రభుత్వం అనుసరిస్తోన్న పారిశ్రామిక విధానాల గురించి వివరించనున్నారు. అనంతరం కేసీఆర్తో లంచ్ మీట్లో పాల్గొంటారు.