ఆ రెండు పార్టీలు దొందు దొందే, మోసం, వంచన.. రేవంత్ విసుర్లు
రాహుల్ గాంధీ సభ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహాంతో ఉన్నాయి. భారీగా జన సమీకరణ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాయి. తమ సత్తా ఏంటో చూడాలని అనుకుంటున్నారు. ఇటు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రైతులను మోసం చేస్తున్నాయని విమర్శించారు. వడ్లు కొనమని రైతులు అడుగుతుంటే ధర్నాల పేరుతో ఈ రెండు పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు.
రైతులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణినీ ఎండగట్టేందుకు రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేయబోతున్నామనేది డిక్లరేషన్ ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం ఖాయమని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాబోయే సోనియమ్మ రాజ్యంలో అభివృద్ధి చేసి చూపుతామని చెప్పారు.
అధికారంలోకి వచ్చాక 2004 నాటి స్వర్ణ పాలన అందిస్తామని చెప్పారు. రైతులకు మళ్ళీ అన్నిరకాల సబ్సిడీలు అందిస్తామని చెప్పారు. వరంగల్ సభకు రాష్ట్రంలో రైతులు కుటుంబానికి ఒక్కరు చొప్పున తరలి రావాలని పిలుపిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చేసే యుద్ధానికి రైతులు అండగా నిలబడాలని కోరారు. ప్రతి బూత్ ఎన్ రోలర్ తొమ్మిది మందిని తీసుకురావాలని కోరారు.
కేసీఆర్ అవినీతికి అవధులు లేవని రేవంత్ రెడ్డి విమర్శించారు. యాదగిరి నరసింహ స్వామి దేవాలయ నిర్మాణంలో కూడా అవినీతి జరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవాలని సూచించారు. రెండు వేల కోట్ల రూపాయలతో నిర్మించిన దేవాలయంలో కూడా కేసీఆర్ కుటుంబ అవినీతి దాగివుందని ఆరోపించారు. యాదగిరి నరసింహ స్వామి కూడా కేసీఆర్ కుటుంబానికి బలైపోయారని పేర్కొన్నారు.
అమరవీరుల స్థూపంలో కూడా అవినీతి జరిగింది రేవంత్ ఆరోపించారు. 62 కోట్లతో మొదలైన స్థూపం.. రెండు వందల కోట్లు చెల్లించినా పుర్తి కాలేదన్నారు. కేసీఆర్ కుటుంబం ఆస్తులు నిజాం వారసుల సంపదను మించిపోయాయని గుర్తుచేశారు. కానీ రాష్ట్రంలో అభివృద్ది మాత్రం పడకేసిందని చెప్పారు. పాలనను గాలికి వదిలేసిందని ఆరోపించారు.