తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్... ఈ నెల 27 నుంచి రైతు బంధు డబ్బులు...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు తీపి కబురు చెప్పారు. యాసంగి సీజన్కు సంబంధించిన రైతు బంధు సహాయాన్ని డిసెంబర్ 27 నుంచి వచ్చే జనవరి 7వ తేదీ వరకు రైతులకు అందించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు మిగలకుండా అందరికీ సాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైతుల ఖాతాలోనే నేరుగా డబ్బులను జమ చేయాలని చెప్పారు. ఇందుకోసం రూ.7,300 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. తక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల నుంచి మొదలుపెట్టి, ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల వరకు అందరికీ 10 రోజుల వ్యవధిలో డబ్బులు జమ చేయాలని చెప్పారు. సోమవారం(డిసెంబర్ 7) హైదరాబాద్లోని ప్రగతి భవన్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రైతుబంధు సహాయం పంపిణీకి అనుసరించాల్సిన విధానంపై చర్చించి, కార్యాచరణను ఖరారు చేశారు.
తాజా సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రేపటి(డిసెంబర్ 8) భారత్ బంద్ గురించి కూడా చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న రైతుల డిమాండుకు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ బంద్లో పాల్గొనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం నిర్వహించే నిరసన కార్యక్రమాలపై ఆయన చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ ఎస్. నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రామకృష్ణ రావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జనార్థన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాగా, తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఏటా రెండు సీజన్లకు ఎకరానికి రూ.5వేలు చొప్పును రెండుసార్లు పంట పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. 2018 నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలుచేస్తోంది. ఇందుకోసం ఏటా రూ.14వేల కోట్లు ఖర్చు చేస్తోంది.