అమీన్పూర్ గ్యాంగ్ రేప్ కేసులో బిగ్ ట్విస్ట్.. అసలు మిస్టరీ బయటపెట్టిన పోలీసులు
హైదరాబాద్ శివారులోని అమీన్పూర్లో 16 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిందన్న ఘటనలో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. 10 రోజుల కిందట పరిచయమైన వ్యక్తితో కలిసి నిమాకు వెళ్లిన ఆ బాలిక.. తల్లిదండ్రులకు భయపడి తనపై గ్యాంగ్ రేప్ జరిగిందంటూ కట్టుకథ అల్లినట్లు పోలీసులు చెప్పారు. దిశ కేసు తర్వాత అంతటి సంచలనం రేపిన ఈ వార్త, బాలికకు సంబంధించిన వీడియోలు దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో దీనిపై పోలీసులు చురుకుగా వ్యవహరించారు. గురువారం సాయంత్రం వెలుగులోకి వచ్చిన ఈ కేసును గంటల వ్యవధిలోనే ఛేదించగలిగారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు.
మియాపూర్ లో సినిమా చూసి..
శ్రీకాళుళం జిల్లాకు చెందిన బాలిక తల్లిదండ్రలు రెండేళ్లుగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు, అమీన్పూర్లోని వాణినగర్లో ఓ అపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఊళ్లోనే అమ్మమ్మ దగ్గర ఉంటోన్న బాలిక.. సంక్రాతి సెలవులు కావడంతో 10 రోజుల కిందటే సిటీకి వచ్చింది. స్థానికంగా ఉంటోన్న సందీప్ అనే యువకుడితో పరిచయం, ప్రేమ ఏర్పాడ్డాయి. గురువారం రహస్యంగా బాయ్ఫ్రెండ్ సందీప్తో కలిసి మియాపూర్లో సినిమా చూసిందా బాలిక. తిరుగుప్రయాణంలో సడెన్ గా తల్లి నుంచి ఫోన్ రావడంతో ఏం చెప్పాలో తెలియక.. తనను నలుగురు వ్యక్తులు రేప్ చేసినట్లు కథ అల్లంది.
రాత్రంతా విచారణ.. వైద్య పరీక్షలు..
తాను గ్యాంగ్ రేప్ కు గురయ్యానని బాలిక ఫోన్ లో చెప్పడంతో ఆమె తల్లి వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెల్ ఫోల్ సిగ్నల్స్ ఆధారాంగా బాలిక జాడ కనిపెట్టిన పోలీసులు.. ఆమెను ఘటనా స్థలం నుంచి రెస్క్యూ చేసి సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలికపై రేప్ జరగలేదని డాక్టర్లు చెప్పడంతో పోలీసులు షాక్ తిన్నారు. మహిళా ఎస్సై ఆధ్వర్యంలో బాలికను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పింది. గురువారం రాత్రంతా సంగారెడ్డి ఆస్పత్రిలోనే బాలికను, ఆమె తల్లిదండ్రులను పోలీసులు విచారించారు. చివరికి సందీప్ ను అదుపులోకి తీసుకోవడంతో మొత్తం వ్యవహారం బయటపడింది.
వీడియోలు వైరల్ చేసిన ఇంటి యజమాని..
ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లేలోపే.. బాధిత బాలికను వీడియో తీసి, దాన్ని వైరల్ చేసిన వ్యక్తిని రవిగౌడ్గా పోలీసులు గుర్తించారు. బాలిక తల్లిదండ్రులు పనిచేస్తున్నది ఈ రవిగౌడ్కు చెందిన అపార్ట్మెంట్లోనే కావడగం గమనార్హం. ఆపదో ఉన్న బాలికను కాపాడాల్సిందిపోయి వీడియోలు తీసి వైరల్ చేసిన ఇంటి యజమాని రవి గౌడ్ పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. బాలికకు సందీప్ ను పరిచయం చేసింది కూడా రవి గౌడే.
ఎన్నికల ప్రచారంలో కలిసి..
బాలిక తల్లిదండ్రులు పనిచేస్తోన్న అపార్ట్మెంట్కు రవి గౌడ్ యజమాని కాగా.. అదే బిల్డింగ్కు సందీప్ ఎలక్ట్రిషన్గా పనిచేస్తున్నాడు. ఇటీవలి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో రవి గౌడ్ భార్య కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. 10 రోజుల కిందటే సిటీకి వచ్చిన బాలిక.. తమ ఇంటి యజమాని భార్య తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. సందీప్ తోపాటు ఇంకొందరు కూడా కలిసి ప్రచారం నిర్వహించారు. ఆ క్రమంలో సందీప్ కు బాలిక దగ్గరకావడం, ఇద్దరు కలిసి రహస్యంగా సినిమాకు వెళ్లేదాకా వ్యవహారం సాగింది.
సీసీటీవీ కెమెరాల్లో..
బాలిక తనకు తానే బాయ్ ఫ్రెండ్ బైక్ ఎక్కి సినిమాకు వెళ్లడం, థియేటర్ లో నుంచి బయటికి రావడం లాంటి సీన్లన్నీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. తల్లికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక గ్యాంగ్ రేప్ కథ అల్లిన బాలిక.. డాక్టర్ల రిపోర్టు తర్వాత మాట మార్చింది. నలుగురు వ్యక్తులు రేప్ కు ప్రయత్నించారని.. అటుగా కారు రావడంతో పారిపోయారని చెప్పింది. మైనర్ బాలికను మాయమాటలు చెప్పి లొంగదీసుకున్న బాయ్ ఫ్రెండ్ సందీప్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.