తెలంగాణలో మరింత విస్తరించిన రుతుపవనాలు: హైదరాబాద్ సహా జిల్లాల్లో భారీ వర్షాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం ఖమ్మంలోకి ప్రవేశించిన రుతుపవనాలు నిజామాబాద్ వరకు విస్తరించినట్లు పేర్కొంది. ఇక రాగల ఒకటి రెండు రోజుల్లో తెలంగాణ అంతటా విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.
శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలోని లు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. చాలా రోజులుగా ఎండతీవ్రత, ఉక్కపోతతో ఇబ్బంది పడిన జంట నగరాల ప్రజలు నిన్నటి నుంచి వాతావరణం చల్లగా మారడంతో ఉపశమనం పొందారు.

కాగా, శుక్రవారం ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతం పరిసరాలలోని ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరలో సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కి.మి. వరకు కొనసాగుతూ ఎత్తుకి వెళ్లే కొలది నైరుతి దిశగా కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఉత్తర తెలంగాణ జిల్లాలు, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో సిద్ధిపేట జిల్లాలో సుమారు గంటసేపు కుండపోత వర్షం కురిసింది. వర్షం ప్రభావంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా ఎల్బీనగర్ నుంచి హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతం వరకు భారీ వర్షం పడింది. ఈదురు గాలులు వీచడంతో అక్కడక్కడ చెట్లు నెలకొరిగాయి. వర్షం ప్రభావంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు, వరంగల్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. ఇక నాట్లు వేసి ఎదురుచూస్తున్న రైతులు.. వర్షం పడటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications