వావ్.. అమర్త్య.. కొవిడ్ బ్యాడ్జీ ఆవిష్కరణ, పదో తరగతి విద్యార్థి అద్భుతం..
కరోనా కేసులు.. ప్రభావం ఇప్పుడు కాస్త తక్కువే ఉంది. అందుకే స్కూళ్లు, కాలేజీలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే కరోనా లక్షణాలు మారుతున్నాయి. రోజుకో కొత్త సింప్టమ్ చెబుతున్నారు. అయితే కరోనా లక్షణాలతో బాధపడుతూ స్కూల్కు వెళ్లే విద్యార్థులను సులువుగా గుర్తించే పరికరాన్ని ఓ విద్యార్థి ఆవిష్కరించారు. సదరు బాలుడు సిటీలోని సెయింట్పాల్స్ హైస్కూల్కు చెందిన వారే కావడం విశేషం. అతను పదో తరగతి చదుతున్నాడు. నేషనల్ ఇన్స్పైర్ పోటీలకు తన ప్రాజెక్టును పంపించి హైదరాబాద్ జిల్లా తరఫున అమర్త్య వరహాల ఎంపికయ్యాడు.
కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో స్కూల్ మూసివేయడం, ప్రభుత్వం ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం, కొవిడ్ తగ్గిన తర్వాత బడులు ప్రారంభించినా విద్యార్థులు జ్వరంతో బాధపడుతూ వెళ్లడాన్ని గమనించిన అమర్త్య.. తన వంతుగా ఏదో ఒకటి చేయాలని అనుకున్నాడు. విషయాన్ని తల్లిదండ్రులు ఉస్మానియా ఆస్పత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ అజయ్మోహన్, డాక్టర్ కళ్యాణికి తెలియజేశాడు. జిల్లాస్థాయిలో నిర్వహించే ఇన్స్పైర్ పోటీల విషయాన్ని సైన్స్ టీచర్ శర్వాణి అతడికి చెప్పడంతో ప్రయోగంపై మరింత దృష్టి సారించాడు.

25 శాతం మందికి జ్వరం..
గదిలో ఉండే విద్యార్థుల్లో 25 శాతం మంది తెలియకుండానే జ్వరం బారిన పడుతూ ఇంటికి వెళ్తున్నారు. వారి నుంచి తల్లిదండ్రులకు కొవిడ్ సులువుగా అంటే అవకాశం ఏర్పడుతోంది. విద్యార్థుల్లో జ్వర తీవ్రతను కనిపెట్టే బ్యాడ్జీని అమర్త్య తయారు చేశారు. ఆర్డినరీ నానో ప్రాసెసర్తో కూడిన యూనిట్లో చిన్నపాటి ఎల్ఈడీ బల్బు, లిథిమ్ బ్యాటరీని అమర్చి శరీరానికి బ్యాడ్జీ తాకే సెన్సార్ను పెట్టాడు. విద్యార్థులు స్కూల్ బ్యాడ్జీ మాదిరిగా కొవిడ్ బ్యాడ్జీని జేబుకు ధరించి పాఠశాలకు వెళ్లిన సమయంలో 99 డిగ్రీల కంటే శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే ఎల్ఈడీ లైట్ ఆటోమెటిక్గా వెలుగుతుంది.

కొవిడ్ లక్షణాలు
సదరు విద్యార్థికి కొవిడ్ లక్షణాలు ఉన్నాయని గ్రహించి.. అతడిని తోటి విద్యార్థులకు దూరంగా కూర్చోబెట్టడమో.. ఇంటికి పంపించడమో చేసే అవకాశం ఉంటుంది. బాధితుడికి తక్షణ వైద్యం అందించవచ్చని అమర్త్య తెలిపారు. రూ.500 ఖర్చుతో తయారు చేసిన కొవిడ్ బ్యాడ్జీని సెల్ఫోన్ లాగా చార్జింగ్ పెట్టుకోవచ్చని, శరీరానికి ఎలాంటి హాని కలిగించే వస్తువులు వినియోగించలేదని చెప్పారు. పాఠశాలల్లో కొవిడ్ సూపర్ స్పైడర్లను తగ్గించేందుకు దీనిని రూపొందించినట్లు చెప్పారు.

365 ప్రాజెక్టులు
పిల్లల్లో దాగి ఉన్న క్రియేటివిటీని వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా పోటీలను నిర్వహిస్తోంది. ఇటీవల ఆన్లైన్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలకు 365 ప్రాజెక్టులు వచ్చాయని, అందులో 34 ప్రాజెక్టులను జాతీయస్థాయికి ఎంపిక చేసినట్లు చెప్పారు.
నేషనల్ లెవల్ ఇన్స్పైర్ పోటీలకు హైదరాబాద్ జిల్లా నుంచి సెయింట్ పాల్స్ హైస్కూల్కు చెందిన పదోతరగతి విద్యార్థి అమర్త్య తయారు చేసిన 'కొవిడ్ బ్యాడ్జీ' ఒక్కటే జాతీయస్థాయికి ఎంపికైందని వివరించారు. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలుగులోకి రానీయాలి.. వారిని మరింత ప్రోత్సహించి అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది.












Click it and Unblock the Notifications