గ్రేటర్ హైదరాబాద్లో మరింత ఉధృతంగా కరోనా తీవ్రత: తెలంగాణలో కోటికి చేరువగా టెస్టింగులు
హైదరాబాద్: తెలంగాణలో రోజురోజుకూ కరోనా వైరస్ కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోజువారీ కేసుల సంఖ్య క్రమం తప్పకుండా పెరిగిపోతూనే ఉంది. అటు ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వందల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అధికార యంత్రాంగాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య కేసీఆర్ సర్కార్ అన్ని పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవును ప్రకటించింది. పలు జిల్లాల్లో అనధికారిక కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. మాస్కులను ధరించడాన్ని అధికారులు తప్పనిసరి చేశారు. మాస్కులను ధరించకపోతే జరిమానాలను విధిస్తున్నారు.
కల్లోలం రేపుతోన్న కరోనా: 53 వేలకు పైగా కొత్త కేసులు: నాలుగు లక్షలకు చేరువగా
తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 518 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ముగ్గురు మరణించారు. 204 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,05,309కి చేరుకుంది. ఇందులో సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, ఇళ్లకు వెళ్లిన వారు 2,99,631 మంది ఉన్నారు. 1,683 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్గా ఉన్న కేసులు నాలుగు వేలకు చేరువ అయ్యాయి. తాజా బులెటిన్ ప్రకారం.. 3,995 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. గృహాలు, ఇన్స్టిట్యూషనల్ ఐసొలేషన్లో 1,767 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా 157 కేసులు నమోదయ్యాయి. ఈ మధ్యకాలంలో ఈ రోజువారీ కేసుల సంఖ్య వంద దాటడం ఇదే తొలిసారి. ఆదిలాబాద్-9, భద్రాద్రి కొత్తగూడెం-4, జగిత్యాల-13, జనగామ-6, జయశంకర్ భూపాలపల్లి-5, జోగుళాంబ గద్వాల-3, కామారెడ్డి-8, కరీంనగర్-18, ఖమ్మం-8, కొమరం భీమ్ ఆసిఫాబాద్-5, మహబూబ్నగర్-5, మహబూబాబాద్-4, మంచిర్యాల-11, మెదక్-6, మేడ్చల్ మల్కాజ్గిరి-44, ములుగు-2, నాగర్ కర్నూల్-5, నల్లగొండ-15, నారాయణ్పేట్-3, నిర్మల్-8, నిజామాబాద్-29, పెద్దపల్లి-7, రాజన్న సిరిసిల్ల-8, రంగారెడ్డి-38, సంగారెడ్డి-21, సిద్ధిపేట్-7, సూర్యాపేట్-13, వికారాబాాద్-7, వనపర్తి-5, వరంగల్ రూరల్-7, వరంగల్ అర్బన్-13, యాదాద్రి భువనగిరి-9 కేసులు నమోదు అయ్యాయి.
తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల్లో 57,548 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్లో వెల్లడించారు. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించిన పరీక్షలు 50,258 కాగా.. మిగిలినవీ ప్రైవేటు హాస్పిటల్స్లో నమోదయ్యాయి. కొత్త వాటితో ఇప్పటిదాకా నిర్వహించిన మొత్తం టెస్టింగుల సంఖ్య 99,03,125గా నమోదైంది. సగటున ప్రతి 10 లక్షల జనాభాకు 2,66,069 మంది శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొన్నారు.