షర్మిలతో త్వరలో మాజీ మంత్రి భేటీ?: వైఎస్సార్ సహచరుడిగా: ఖమ్మం సభకు పోలీసుల అనుమతి?
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి సన్నహాలు చేసుకుంటోన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిలకు.. మద్దతు ఇచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పార్టీ పేరు, జెండా, అజెండా, విధి విధానాల రూపకల్పన.. ఇంకా ప్రాథమిక దశలో ఉన్న సమయంలోనే ఆమెకు అండగా నిలిచేవారి సంఖ్య మెరుగుపడుతోంది. అధికారికంగా పార్టీ పేరును, విధి విధానాలను ప్రకటించిన తరువాత..భారీ సంఖ్యలో వలసలు ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

పార్టీ పెట్టకముందే..
వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీలో ఇప్పటికే కొందరు ప్రముఖులు చేరారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని లోటస్పాండ్ నివాసంలో ఆమెను కలిసి.. తమ మద్దతును ప్రకటించారు. వచ్చేనెల 9వ తేదీన ఖమ్మంలో నిర్వహించే సభ సందర్భంగా వారంతా.. షర్మిల పార్టీ కండువాను కప్పుకోనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభన్, టిఆర్ఎస్కు చెందిన మధిర మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శీలం విద్యాలత వెంకటరెడ్డి దంపతులు షర్మిల పార్టీలో చేరారు కూడా. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కొండా రాఘవరెడ్డి.. మొదటి నుంచీ షర్మిల వెంటే ఉంటున్నారు.

షర్మిల పార్టీలోకి మాజీమంత్రి సంభాని
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్ కూడా షర్మిల పార్టీలో చేరబోతోన్నట్లు ప్రచారం సాగుతోంది. ఖమ్మం సభ సందర్భంగా ఆయన షర్మిల చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకొంటారని జిల్లాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకట్రెండు రోజుల్లో సంభాని చంద్రశేఖర్..లోటస్ పాండ్ నివాసంలో షర్మిలను కలుస్తారని, పార్టీలో చేరడానికి తన సంసిద్ధతను వ్యక్తం చేస్తారని సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో మనుగడ సాగించడం కష్టమనే అభిప్రాయంలో సంభాని ఉన్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.

వైఎస్ అనుచరుడిగా.
సంభాని చంద్రశేఖర్కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా పేరుంది. ఆయన కేబినెట్లోనే మంత్రిగా పనిచేశారు. 1999, 2004 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. వైఎస్సార్ కేబినెట్లో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం తెలంగాణ రాజకీయాల్లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ.. ఆయన కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు. క్రియాశీలక నేతగా ఉన్నారు. తరచూ జిల్లాల్లో పర్యటిస్తోన్నారు. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపుతున్నారు.

కాంగ్రెస్కు కంచుకోటగా పాలేరు..
పాలేరు నియోజకవర్గాన్ని కాంగ్రెస్కు కంచుకోటగా మార్చడంలో ఆయన కృషి చేశారు. 2018 నాటి ఎన్నికల్లో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వర రావును సైతం ఓడించి ఈ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవడమే దీనికి నిదర్శనం. కందాల ఉపేందర్ రెడ్డి ఇక్కడ విజయం సాధించారు. జిల్లా రాజకీయాలపైనా ఆయనకు గట్టి పట్టు ఉంది. షర్మిల పార్టీ పెట్టడాన్ని ఆయన ఇదివరకే ఓ సారి స్వాగతించారు కూడా. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీని పెట్టొచ్చంటూ వ్యాఖ్యానించారు. ఆయన షర్మిల పార్టీ వైపు సానుకూలంగా ఉన్నారనే సంకేతాలను ఇచ్చారు. త్వరలో ఆయన షర్మిలను కలుస్తారని, పార్టీలో చేరే విషయంపై స్పష్టత ఇస్తారనే ప్రచారం ఖమ్మం జిల్లాలో సాగుతోంది. కాగా- వచ్చేనెల 9వ తేదీన ఖమ్మంలో షర్మిల నిర్వహించబోయే సభకు పోలీసులు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. దీన్ని ఆ పార్టీ నాయకులు ఇంకా ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications