వద్దంటే వాన: 14వ తేదీ వరకు జోరుగా, జనం ఇబ్బందులు
ఈ సారి వరుణ దేవుడి బీభత్సం కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా వర్షాల ప్రభావం ఎక్కువే ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల సంగతి అయితే చెప్పక్కర్లేదు. తెలంగాణలో కుంభవృష్టి కొనసాగుతోంది. దీంతో జనం ఇబ్బంది మాములుగా లేదు. రైతులు కూడా అపసోపాలు పడుతున్నారు. వర్షంతో వరదనీరు నిలిచింది. దీంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. మురికి కాలువల పక్కన ఉండేవారు కష్టాలు అన్నీ ఇన్నీ కావు. దీంతో జ్వరాల బారిన కూడా పడుతున్నారు. వైరల్ ఫీవర్, టైఫాయిడ్, మలేరియా వస్తున్నాయి. కరోనా కేసుల పెరుగుదల కూడా నమోదవుతుంది.
Recommended Video
తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. మరో ఐదు రోజులు వర్షాలు కురువనున్నాయి. ఈ నెల 14వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా తీర ప్రాంతంలో ఉన్న వాయుగుండం బలహీనపడింది. ఇది పశ్చిమ వాయువ్యదిశగా కదిలి.. రానున్న 12 గంటల్లో మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది.
ఈ నెల 13వ తేదీన వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదిలి.. ఆ తర్వాత 24 గంటల్లో బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో 14న మంచిర్యాల, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు కొనసాగుతుంది.