Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందా?.. ఆరు నెలలా, రెండేళ్లా.. కాంగ్రెస్ నేతల మర్మమేంటి?

హైదరాబాద్ : ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసి రెండోసారి అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. బంపర్ మెజార్టీతో 88 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సైతం కారెక్కిస్తోంది గులాబీ హైకమాండ్. కేవలం 19 స్థానాల్లో మాత్రమే గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు.. ఒక్కొక్కరుగా చేజారిపోతుండటం గమనార్హం.

టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం గులాబీ గూటికి చేరుతున్న క్రమంలో.. ఆ పార్టీ సీనియర్లు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. మొన్నటికి మొన్న వి.హనుమంతరావు రెండేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవాలని పెద్దమ్మతల్లికి మొక్కుకున్నానంటూ వ్యాఖ్యానించారు. అదలావుంటే ఆర్నెళ్లల్లో కేసీఆర్ సర్కార్ కూలిపోవడం ఖాయమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పడం హాట్ టాపికయింది. ఒక్క రోజు వ్యవధిలోనే ఇద్దరు నేతలు ఇలా మాట్లాడటం చర్చానీయాంశమైంది.

 కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం..!

కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం..!

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం కేసీఆర్ పై గరమయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని ధ్వజమెత్తారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పిన రాజగోపాల్ రెడ్డి.. రానున్న ఆరు నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు. మంగళవారం (07.05.2019) నాడు మీడియా ప్రతినిధులతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి పలు అంశాలు ప్రస్తావించారు.

రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని చెప్పుకొచ్చిన రాజగోపాల్ రెడ్డి.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి రావడం దారుణమన్నారు. సీఎం కేసీఆర్ పనికిరాని విధానాలతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని వ్యాఖ్యానించారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని.. రాష్ట్రంలో కుటుంబ పాలన అవినీతిని గుట్టురట్టు చేసి కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామన్నారు. ఇక రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందని స్పష్టం చేశారు.

 పెద్దమ్మ తల్లికి మొక్కుకున్నా

పెద్దమ్మ తల్లికి మొక్కుకున్నా


అదలావుంటే, రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ కు సరిగ్గా ఒక్కరోజు ముందే సోమవారం (06.05.2019) నాడు వి.హనుమంతరావు బాంబ్ పేల్చారు. సీఎం కేసీఆర్ టార్గెట్ గా చేసిన ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. రెండేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవాలని.. జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లికి మొక్కుకున్నానని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రగతి భవన్ విడిచి పారిపోయే పరిస్థితి తప్పకుండా వస్తుందన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కేసీఆర్ కు తగిన గుణపాఠం చెబుతామన్న వీహెచ్.. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందన్నారు.

రాజగోపాల రెడ్డి వ్యాఖ్యల మర్మం అదేనా?

రాజగోపాల రెడ్డి వ్యాఖ్యల మర్మం అదేనా?

ఒక్కరోజు వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు.. వేర్వేరు సందర్భాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడం గురించి మాట్లాడారంటే తెర వెనుక ఏదైనా జరుగుతుందా అనే అనుమానాలు లేకపోలేదు. వీహెచ్, పెద్దమ్మ తల్లిని మొక్కుకున్నట్లు చెప్పారు ఓకే.. కానీ రాజగోపాల్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి ఆరు నెలల్లో పడిపోతుందని వ్యాఖ్యానించడం దేనికి సంకేతమనే వాదనలు జోరందుకున్నాయి.

ప్రజల మద్దతుతో, బంపర్ మెజార్టీతో 88 స్థానాల్లో గెలిచి రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఐదేళ్ల పాటు ఢోకా లేదు. అలాంటిది రాజగోపాల్ రెడ్డి ఆర్నెళ్లల్లో ప్రభుత్వం పడిపోతుందని చెప్పడం వెనుక మతలబు ఏంటనేది చర్చానీయాంశంగా మారింది. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఢిల్లీలో చక్రం తిప్పి కేసీఆర్ సర్కార్ ను ఇబ్బందిపెట్టాలన్నది ఆయన మాటల వెనుక దాగున్న పరమార్థం కావొచ్చేమో మరి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+