టీఆర్ఎస్ ఎమ్మెల్యేలూ బీజేపీలోకి..: డీకే అరుణ సంచలనం, కేసీఆర్, హరీశ్కు అదే భయం
హైదరాబాద్: తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం ప్రకటించిన 70 మంది సభ్యుల టీంలో ఫైర్ బ్రాండ్ డీకే అరుణ కీలక స్థానం దక్కించుకున్నారు.

తెలంగాణలో బీజేపీదే అధికారం..
డీకే అరుణను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా జేపీ నడ్డా ప్రకటించారు. ఈ నేపథ్యంలో డీకే అరుణ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా బీజేపీవైపు చూస్తున్నారని అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో కలిసి బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.

టీఆర్ఎస్ అబద్ధపు ప్రచారాల్ని ఎండగడతాం..
టీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధపు ప్రచారాల్ని ప్రజల్లో ఎండగడతామని డీకే అరుణ అన్నారు. టీఆర్ఎస్పై పోరాడుతారా? లేదా? అని తాను పార్టీలో చేరేటప్పుడే.. కేంద్ర నాయకత్వాన్ని అడిగానని.. పోరాడుతామని హామీ ఇచ్చిందన్నారు. తనకు ఈ బాధ్యత ఇవ్వడం దానికి సంకేతమేనని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, అమిత్ షా, పార్టీ నాయకత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. మహిళల్లో శక్తివంతులను ఎన్నుకున్నారని అన్నారు. ఏపీ నుంచి పురంధేశ్వరికి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చిన విషయం తెలిసిందే.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలూ టీఆర్ఎస్ పార్టీలోకి..
తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది బీజేపీలో చేరతారని డీకే అరుణ వ్యాఖ్యానించారు. అంతేగాక, కేసీఆర్ నియంత పాలనకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకంగా ఉన్నారని.. వారంతా బీజేపీలో చేరతారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు జాతీయ స్థాయిలో బాధ్యతలు అప్పగించినా.. తన ఫోకస్ మాత్రం రాష్ట్రంపైనేనని డీకే అరుణ స్పష్టం చేశారు. కాగా, బీజేపీలో కీలక పదవి రావడంపై డీకే అరుణ అభిమానులు, బీజేపీ కార్యకర్తలు బాణాసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు.

కేసీఆర్, హరీశ్ భయపడుతున్నారు..
కేంద్ర పథకాలను, నిధులను వాడుకుంటు కూడా.. నరేంద్ర మోడీ పేరు చెప్పేందుకు, ఫొటో పెట్టేందుకు కేసీఆర్ భయపడుతున్నారని డీకే అరుణ అన్నారు. బీజేపీ అంటే భయంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశ ప్రజలందరూ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, తెలంగాణ ప్రజలు కూడా బీజేపీ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. దుబ్బాక ఎన్నికల్లో గెలవలేమనే భయంతోనే హరీశ్ రావు విద్యుత్ మీటర్లు పెడతారంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications