ముదిరిన వ్యవహారం: బీజేపీ జాతీయ కార్యదర్శిపై తెలంగాణ పోలీసుల లుక్ అవుట్ నోటీస్..!!
హైదరాబాద్: అధికార టీఆర్ఎస్కు చెందిన నలుగురు శాసన సభ్యుల కొనుగోలు కేసు దర్యాప్తు మరింత ముమ్మరమైంది. ఈ కేసును విచారించడానికి కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్..ఈ కేసులో ప్రమేయం ఉన్నట్టుగా భావిస్తోన్న భారతీయ జనత పార్టీ సీనియర్ నాయకులకు ఇప్పటికే నోటీసులను పంపించారు.
టీఆర్ఎస్కు చెందిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ శాసన సభ్యుడు బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డిలను పార్టీ ఫిరాయించేలా ప్రలోభ పెట్టటానికి ప్రయత్నించినట్టుగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న బీజేపీ నాయకులకు సీవీ ఆనంద్ సారథ్యంలోని సిట్.. ఇప్పటికే నోటీసులను జారీ చేసింది. నోటీసులను అందుకున్న వారిలో కర్ణాటకకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, జాతీయ కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఉన్నారు.
సోమవారం ఆయన సిట్ విచారణకు హాజరు కాలేదు. విచారణలో భాగంగా ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్లో గల సిట్ కార్యాలయానికి రావాల్సి ఉంటుందంటూ ఈ నెల 18వ తేదీ నాడే ఆయనకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. దర్యాప్తునకు హాజరుకాకపోతే 41 ఏ (3), (4) సెక్షన్ల కింద అరెస్టు చేసే అధికారం తమకు ఉంటుందనీ స్పష్టం చేశారు.
ఈ విచారణకు బీఎల్ సంతోష్ హాజరు కాలేదు. దీనితో సిట్ అధికారులు ఆయనపై లుక్ అవుట్ నోటీస్ను జారీ చేసినట్లు సమాచారం. బీఎల్ సంతోష్తో పాటు భారత్ ధర్మ జనసేన (బీడీజేఎస్) అధ్యక్షుడు తుషార్ వెల్లంపల్లి, కేరళకు చెందిన డాక్టర్ జగ్గు కొట్టిలిల్పైనా లుక్ అవుట్ నోటీస్ జారీ అయింది. దీనితో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అనూహ్య మలుపు తిరిగినట్టయింది. లుక్ అవుట్ నోటీస్ జారీ చేయడం పట్ల తెలంగాణకు చెందిన బీజేపీ నాయకులు భగ్గుమంటోన్నారు.