చైన్ స్నాచింగ్: సిటీలో రెండు కేసులు నమోదు.. కూతవేటు దూరంలో..
చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా మహిళ కనిపించి.. వారిలో మెడలో హారం ఉంటే చాలు.. క్షణాల్లో దోచేసి.. మాయం అవుతున్నారు. ఇవాళ గ్రేటర్ పరిధిలో రెండు కేసులు వచ్చాయి. సికింద్రాబాద్ నార్త్జోన్ పోలీసు సర్కిల్ పరిధిలో ఒకే రోజు రెండు చైన్ స్నాచింగ్ జరిగాయి. మారేడ్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో విజయ అనే మహిళ మెడలోంచి 4 తులాల బంగార గొలుసు తీసుకొని పరారీ కాగా, దానికి ఒక కిలోమీటర్ దూరంలోనే తూకారాం గేట్ పోలీసు స్టేషన్ పరిధిలో రాంబాయి అనే మరో మహిళ మెడలో నుండి మూడున్నర తులాల చైన్ ను దుండగులు తెంచుకుపోయారు.
మారేడ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో సంజీవయ్య కాలానికి చెందిన విజయ తమ ఇంటికి అరకిలోమీటర్ దూరంలో ఉన్న ప్రైవేట్ హస్ఫటల్ కి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా వెనుకవైపు నుండి పల్సర్ వాహనంపై వచ్చిన దుండగుడు మెడలోని చైన్ లాక్కొని పారిపోయాడు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఘటన జరిగిందని బాధితురాలు తెలిపింది.
మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో మరొ ఘటన జరిగింది. ఉదయం గొలుసు తెంపుకు పోయిన స్ధలానికి కిలోమీటర్ దూరంలో తుకారాం గేట్ పోలీసు స్టేషన్ పరిధిలో రాంబాయి అనే మరో మహిళ మెడలోంచి మూడున్నర తులాల బంగారం గొలుసు లాక్కొని పారిపోయాడు. బాధితులిద్దరూ పోలీసులకు పిర్యాదు చేశారు. ఘటనా స్ధలాలకు చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. రెండో ఘటనల్లో చోరీకి వాడిన వాహనం యాక్టివాగా గుర్తించారు. వెహికల్ నంబర్ను కూడా సీసీ టీవీ ఫుటేజీలో గుర్తించినట్టు సమాచారం. టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేశారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.