ఈటల రాజేందర్కు ఉపఎన్నిక ముందు మరో షాక్: గుడ్బై చెప్పిన ఇద్దరు కీలక అనుచరులు
హైదరాబాద్: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్కు హుజూరాబాద్ ఉపఎన్నికల కు ముందు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు మద్దతు దారులు అధికార టీఆర్ఎస్ వైపు వెళ్లగా తాజాగా మరో ఇద్దరు ప్రధాన అనుచరులు కూడా ఈటల రాజేందర్కు సాకిచ్చారు.

ఈటల రాజేందర్కు గుడ్బై చెప్పిన మరో ఇద్దరు కీలక అనుచరులు
ఈటల రాజేందర్కు ప్రధాన అనుచరులుగా ఉన్న పింగిలి రమేష్, చుక్కా రంజిత్.. దూరమయ్యారు. పింగిలి రమేష్ సింగిల్ విండో వైస్ ఛైర్మన్గా ఉన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీవైపు వీరు మొగ్గుచూపారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో విజయం సాధించాలని తీవ్రంగా శ్రమిస్తున్న ఈటల రాజేందర్కు ఇలా అనుచరులు షాకిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్, కేసీఆర్ తమ అనుచరులను, నేతలను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారని ఈటల ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

విస్తృతంగా పర్యటిస్తున్న ఈటల రాజేందర్
హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా సాగుతున్న ఈటల రాజేందర్ తన పాత అనుచరులతోపాటు బీజేపీ నేతలను కూడా కలుపుకుపోతున్నారు. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు ఈటల రాజేందర్. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్, టీఆర్ఎస్ సర్కారు, ఇతర మంత్రులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ తన యాత్రను కొనసాగిస్తున్నారు.

ఉపఎన్నిక గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్
మరోవైపు, అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా ఉపఎన్నికలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హరీశ్ రావుతోపాటు పలువురు మంత్రులు హుజూరాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అంతేగాక, టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గం నుంచే దళితబంధు పథకాన్ని కూడా ప్రారంభించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తామని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రశ్నించే గొంతును బతికించాలంటూ ఈటల పిలుపు
అయితే, ప్రశ్నించే గొంతును మూగబోనివ్వకుండా కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉందని, రాజీనామా వల్లే నియోజకవర్గంలో వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు. కాగా,శనివారం కరీంనగర్ జిల్లాలోని ఇల్లందకుంట మండలంలోని వంతడుపుల, సిరిసేడు, మర్రివానిపల్లి, బూజునూర్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. రచ్చబండ తరహాలో ప్రజల మధ్య కూర్చొని వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు తమ బాధలను, కష్టాలను ఈటలతో పంచుకున్నారు. అనంతరం పలువురు ఈటల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు.

ఉపఎన్నిక బరిలో కాంగ్రెస్ తరపున కొండా సురేఖ?
భూ కబ్జా ఆరోపణలు రావడంతో ఈటల రాజేందర్ను మంత్రివర్గం నుంచి సీఎం కేసీఆర్ తొలగించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవి కూడా ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్ నియోవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది. తన సొంత నియోజకవర్గం నుంచి తిరిగి గెలిచి తన సత్తా నిరూపించుకోవాలని ఈటల రాజేందర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. టీఆర్ఎస్ కూడా తమ హుజూరాబాద్ నియోజకవర్గంలో మరోసారి టీఆర్ఎస్ జెండా ఎగరేయాలని పట్టుదలగా ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలుపొందేందుకు తనవంతుగా ప్రయత్నం చేస్తోంది. సీనియర్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖను ఈ ఉపఎన్నికలో బరిలోకి దించేందుకు కసరత్తులు చేస్తోంది. మరోవైపు ఇటీవలే బీఎస్పీలో చేరిన మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా హుజూరాబాద్ ఉపఎన్నికలో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications