వెంకయ్య రాష్ట్రపతి కావాలి.. చిరంజీవి ఆకాంక్ష
మెగాస్టార్ చిరంజీవి, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇరువురు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలు మానేసి మంచి పని చేశారని వెంకయ్య నాయుడు అన్నారు. రాజకీయాల్లో మాట్లాడే భాష బాగోలేదన్నారు. హైదరాబాద్ అమీర్ పేట్లో నూతనంగా ఏర్పాటు చేసిన యోధ లైఫ్ లైన్ డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మెగాస్టార్ చిరంజీవి, క్రికెటర్ అజారుద్దీన్ హాజరయ్యారు.
ప్రజలకు దూరం.. కానీ
ఉపరాష్ట్రపతి పదవీ వల్ల కొంచం తొందరగా పడుకుంటున్నానని.. కానీ ప్రజలకు దూరంగా ఉండటం కొంచం ఇబ్బందిగా ఉందన్నారు. రాష్ట్రపతి కావాలని తనకేం కోరిక లేదని, చిరంజీవి లాంటి ఎంతో మంది శ్రేయోభిలాషుల కోరిక అని పేర్కొన్నారు. రాజకీయం మీద తనకు ఆసక్తి లేదని, ఇప్పుడు పరిణామాలు చూస్తే తనకు రాజకీయం నచ్చడం లేదన్నారు. ఇంకా కరోనా పోలేదని, ఏదో ఒక వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు. కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ కోసం కాకుండా మన కోసం రూల్స్ పాటించాలని కోరారు.
సేవలు మాటల్లో చెప్పలేం
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమాజానికి చేస్తున్న సేవలు మాటల్లో చెప్పలేం అని సినీ నటుడు చిరంజీవి అన్నారు. వెంకయ్యనాయుడు భారత రాష్ట్రపతి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. అయ్యప్ప సాక్షిగా ఆయన రాష్ట్రపతి కావాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. తాను ఎన్నో ఏళ్లుగా తన సొంత వనరులతో ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నానని చెప్పారు. సినీ పరిశ్రమలో పని చేస్తున్న పేద కళాకారులకు లైఫ్ లైన్ డయోగ్నస్టిక్స్ సెంటర్లో పరీక్షలు చేయించుకునే వెసులుబాటును కల్పించాలని కోరారు.
రాష్ట్రపతి పదవీ చర్చ
వెంకయ్య రాష్ట్రపతి కావాలని చిరంజీవి కామెంట్ చేయడం చర్చకు దారితీసింది. తెలుగు వ్యక్తి ఉన్నత పదవీ చేపట్టబోతున్నారా అనే సంతోషం వ్యక్తం అవుతుంది. కానీ దీనికి సంబంధించి కసరత్తు జరగాలి.. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ నిజంగా జరిగితే అదీ తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ ఆనంద పడతారు. మరీ అదీ నిజం కావాలని మనం అందరం కోరుకుందాం.