ఫ్యాన్స్కు బ్యాడ్న్యూస్: విరిగిన టీమిండియా బౌలింగ్ వెన్నెముక: టెస్ట్ సిరీస్ నుంచి అతను ఔట్
అడిలైడ్: భారత క్రికెట్ జట్టు అభిమానులకు మరో చేదువార్త. ఇప్పటికే తొలి టెస్ట్లో ఎదురైన అత్యంత దారుణ పరాజయానికి తేరుకోలేకపోతోన్న టీమిండియాకు మరో హైఓల్టేజ్ షాక్ తగిలింది. బౌలింగ్ అటాక్.. ఇక బలహీనం కానుంది. టీమిండియా బౌలింగ్ విభాగం వెన్నెముకగా ఉంటూ వస్తోన్న పేసర్ మహ్మద్ షమీ టెస్ట్ సిరీస్ నుంచి అర్ధాంతరంగా తప్పుకొన్నాడు. మిగిలిన మూడు టెస్ట్ మ్యాచ్లకు దూరం అయ్యాడు. తొలిటెస్ట్లో గాయపడ్డ కారణంగా అతను మిగిలిన మ్యాచ్లకు దూరం అయినట్లు జట్టు మేనేజ్మెంట్ వెల్లడించింది.
పాట్ కమ్మిన్స్ బౌలింగ్లో..
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్లో ముగిసిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా మహ్మద్ షమీ గాయపడ్డ విషయం తెలిసిందే. ఇన్నింగ్ చివరి బ్యాట్స్మెన్గా బరిలో దిగిన అతను ఆస్ట్రేలయా ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్ వేసిన ఓ షార్ట్బాల్ను ఆడే సమయంలో గాయపడ్డాడు. పిచ్ పడి గాల్లోకి లేచిన ఆ షార్ట్ బాల్.. నేరుగా షమీ ఎడమ మణికట్టు తాకింది. దీనితో అతను క్రీజ్లోనే కుప్పకూలిపోయాడు. బాధతో విలవిల్లాడిపోయాడు. రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ఫలితంగా- కేప్టెన్ విరాట్ కోహ్లీ తన రెండో ఇన్నింగ్ను 36 పరుగుల వద్దే డిక్లేర్ చేయాల్సి వచ్చింది.
చిట్లిన మణికట్టు ఎముక..
ఈ ఘటనలో మహ్మద్ షమీ మణికట్టు ఎముక చిట్లింది. ఎల్బోకు ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. ప్రస్తుతం అతను బ్యాట్ను కూడా పట్టుకునే స్థితిలో లేరని నిర్ధారించింది. గాయపడ్డ వెంటనే అతణ్ని అడిలైడ్లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ స్కాన్ చేయించగా.. మోచేతి ఎముక ఫ్రాక్చర్ అయినట్లు గుర్తించారు. పోస్ట్ మ్యాచ్ సందర్భంగా. విరాట్ కోహ్లీ కూడా ఇదే విషయాన్ని తెలిపాడు. షమీ గాయంపై ఇప్పటిదాకా ఎలాంటి తాజా సమాచారం లేదని, స్కానింగ్ చేయడానికి అతణ్ని ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు చెప్పుకొచ్చాడు. ఫ్రాక్చర్ కావడంతో ఇక జట్టుకు దూరం అయ్యాడు.
షమీ స్థానంలో ఎవరు?
మహ్మద్ షమీ.. టీమిండియా బౌలింగ్ తురుఫుముక్క. ఆస్ట్రేలియా గడ్డ మీద నిలకడగా రాణిస్తున్నాడు. అడిలైడ్ టెస్ట్లో వికెట్లేమీ తీసుకోలేదు. అంతకుముందు వన్డే ఇంటర్నేషనల్స్, టీ20ల్లో వికెట్లను పడగొట్టాడు. ఇన్నింగ్ ఓపెనర్ బౌలర్ కూడా. అతను గాయపడటం బౌలింగ్ విభాగం బలహీనపడినట్టేనని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. షమీ స్థానంలో ఎవరిని తుది జట్టులోకి తీసుకుంటారనేది ఇంకా నిర్ధారణ కాలేదు. తమిళనాడు ఫాస్ట్ బౌలర్.. యార్కర్ల స్పెషలిస్ట్ టీ నటరాజన్కే అధిక అవకాశాలు ఉన్నాయి. వన్డే, టీ20ల్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడతను.
26 నుంచి రెండో టెస్ట్..
నాలుగు టెస్ట్ల ఈ సిరీస్లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. అడిలైడ్ టెస్ట్లో విజయ దుందుభిని మోగించింది. 1-0 తేడాతో సిరీస్లో ముందంజలో ఉంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య బాక్సింగ్ టెస్ట్.. ఈ నెల 26వ తేదీన ఆరంభం కాబోతోంది. మెల్బోర్డ్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) దీనికి వేదిక కానుంది. తొలి టెస్ట్లో ఎదురైన పరాజయంతో షాక్లో ఉన్న భారత క్రికెట్ జట్టు రెండో మ్యాచ్లో ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సిరీస్లో మిగిలిన మూడు టెస్టులకు విరాట్ కోహ్లీ కూడా దూరం కాబోతోన్నాడు. అతని స్థానంలో రోహిత్ శర్మ జట్టులోకి రానున్నాడు. ప్రస్తుతం అతను ఆస్ట్రేలియాలో క్వారంటైన్లో ఉంటున్నాడు.