'కేంద్రమంత్రి అనంత్ హెగ్డే నాలుక కోస్తే రూ.కోటి ఇస్తా', ప్రకాశ్ రాజ్ కూడాా ఆగ్రహం
బెంగళూరు: దేశ ప్రజలు మతసామరస్యంతో జీవిస్తున్న తరుణంలో వారి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి అనంత్ కుమర్ హెగ్డే నాలుకను కత్తిరించిన వారికి రూ.కోటి నజరానాగా ఇస్తామని కర్నాటకలోని కలబురిగి జిల్లా పంచాయతీ మాజీ సభ్యులు గురుశాంత్ పటేదార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికలలో ఓట్ల కోసం ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, అందుకే తాను ఈ వ్యాఖ్యలు చేయాల్సి వస్తోందన్నారు. రాజ్యాంగాన్ని అనంత కుమార్ విమర్శిస్తున్నారని, ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారెవరైనా దేశద్రోహుల కిందకే వస్తారని, హెగ్డేపై ప్రధాని మోడీ తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
జనవరి 26 వరకు ఇందుకు గడువు ఇస్తున్నానని, ఇది తన సొంత నిర్ణయమని, నాలుక కోసిన వారికి నజరానా ఇస్తానని చెప్పారు. రాజ్యాంగాన్ని సవరిస్తామంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపైనా మండిపడ్డారు.
అంతకుముందు, అనంత్ కుమార్ వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజ్ కూడా మండిపడ్డారు. లౌకికవాదుల మాతృత్వం, పితృత్వం, రక్తం గురించి చవకబారుగా మాట్లాడారని, మనుషుల రక్తం వారి కులాన్ని, మతాన్ని నిర్ణయించవని వ్యాఖ్యానించారు. లౌకికవాదిగా ఉండటం అంటే ఏ మతంతోను, విశ్వాసంతోను గుర్తింపు పొందడం కాదన్నారు. లౌకికవాదమంటే వైవిధ్యమైన మతాలను గౌరవించడం, ఆమోదించడం అన్నారు. ఓ ప్రజాప్రతినిధి ఇలా ఎలా మాట్లాడారని ప్రశ్నించారు.
కర్ణాటకలోని కొప్పళ జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి అనంత్కుమార్ హెగ్డే మాట్లాడుతూ 'హిందూ, ముస్లిం, క్రైస్తవులలో ఎవరో ఒకరిగా చెప్పుకొంటే ఖుషీ అనిపిస్తుంది. లౌకికవాదం అనేది ఇటీవల పుట్టుకొచ్చిన సంప్రదాయం. లౌకికవాదులమని చెప్పుకునే వారి రక్తంపై అనుమానం కలుగుతుంది. వీరు రాజ్యాంగంలో ఉందని వాదిస్తార'ని విమర్శించారు.