ఘోర కారు ప్రమాదం: ట్యాంకర్ను ఢీకొట్టడంతో చిన్నారి సహా 10 మంది మృతి
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రం ఖేడా జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం నడియాడ్ పట్టణం సమీపంలోని అహ్మదాబాద్-వడోదర ఎక్స్ప్రెస్ వేపై పార్క్ చేసిన ట్యాంకర్పైకి ఓ కారు వేగంగా దూసుకెళ్లింది. అతివేగం కారణంగా అదుపుతప్పి ముందు పార్క్ చేసిన ట్రక్కు వెనుక భాగంలోకి కారు చొచ్చుకెళ్లింది.
ఈ ప్రమాద ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఓ ఐదేళ్ల చిన్నారితోపాటు 10 మంది చనిపోయినట్లు నడియాడ్ రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కిరీట్ చౌదరి తెలిపారు. కారు వడోదర నుంచి అహ్మదాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ట్యాంకర్ను వెనుక నుంచి కారు ఢీకొన్న వెంటనే కారులో ఉన్న 8 మంది చనిపోయారని ఆయన చెప్పారు.

మిగతా ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలపాలవడం వల్ల హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ఆ తర్వాత వారిద్దరు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారని ఇన్స్పెక్టర్ కిరీట్ చౌదరి వెల్లడించారు.
కాగా, ఈ ప్రమాదం కారణంగా 93 కిలోమీటర్ల పొడవైన అహ్మదాబాద్-వడోదర ఎక్స్ప్రెస్ వేపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ప్రమాదం జరిగిన వెంటనే రెండు అంబులెన్సులు, ఎక్స్ప్రెస్ హైవే పెట్రోలింగ్ బృందాన్ని ఘటనాస్థలికి పంపించగా సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ప్రమాద ఘటనపై నడియాడ్ ఎమ్మెల్యే పంకజ్ దేశాయ్ సంతాపం వ్యక్తం చేశారు. ట్రక్కులో ఏదో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల ఎక్స్ప్రెస్వేలోని ఎడమ లేన్లో నిలిపి ఉంచారు. కారు వేగంగా ఉండటం వల్ల డ్రైవర్ సకాలంలో బ్రేకులు వేయలేకపోయాడు. దీంతో ట్రక్కును కారు బలంగా ఢీకొట్టింది. అందువల్లే మరణాలు ఎక్కువ సంఖ్యలో సంభవించాయని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications