మహారాష్ట్రలో షాకింగ్- 10 మంది మంత్రులు, 20 ఎమ్మెల్యేలకు కరోనా- డిప్యూటీ సీఎం ప్రకటన
దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న కరోనా వైరస్ మహారాష్ట్రలో ఇంకా తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పటికే అక్కడ సాధారణ కోవిడ్ 19 కేసులతో పాటు ఓమిక్రాన్ వైరస్ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా డిప్యూటీ సీఎం ఓ సంచలన ప్రకటన చేశారు. దీంతో అక్కడ వైరస్ తీవ్రత ఏ స్ధాయిలో ఉందో అర్ధమవుతోంది.
రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య గురువారంతో పోలిస్తే శనివారానికి 50 శాతం పెరిగింది. మహారాష్ట్రలో మొత్తం 10 మంది మంత్రులు, 20 మందికి పైగా ఎమ్మెల్యేలు కోవిడ్ 19 కు పాజిటివ్ పరీక్షించారని డిప్యూటీ సిఎం అజిత్ పవార్ ప్రకటించారు. రాష్ట్రంలో కొత్త కోవిడ్ కేసులు పెరుగుతూ ఉంటే కఠినమైన ఆంక్షలు విధించక తప్పేలా లేదని పవార్ వెల్లడించారు. మహారాష్ట్రలో 8,067 తాజా కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైన ఒక రోజు తర్వాత పవార్ హెచ్చరిక వచ్చింది..

ఇప్పటికే మహారాష్ట్రలో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో రాత్రిపూట కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. ఇప్పుడు కేసుల సంఖ్య మరింత పెరుగుతుండటంతో పగటి పూట ఆంక్షలకూ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏకంగా 10 మంది మంత్రులు, 20 మందికి పైగా ఎమ్మెల్యేలకు కరోనా సోకడంతో అధికారిక కార్యక్రమాలు, పాలనపై ఈ ప్రభావం కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వం తక్షణ చర్యలకు దిగుతోంది. కరోనా పరీక్షల సంఖ్య పెంచడంతో పాటు వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు ఇచ్చింది. అదే సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారిపైనా నిఘా పెరుగుతోంది. పరిస్ధితి చేయిదాటేలా ఉంటే లాక్ డౌన్ కూడా విధించవచ్చనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.
ప్రస్తుతం దేశవ్యావ్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికం మహారాష్ట్రలోనే ఉన్నాయి. వాణిజ్య ప్రాంతాలు ఎక్కువగా ఉండటం, జనాభా దృష్ట్యా కూడా పెద్ద రాష్ట్రం కావడంతో ఇక్కడ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. దీంతో కొత్త సంవత్సరం సందర్భంగా వేడుకలపై అధికారులు ఆంక్షలు విధించారు. అయినా ఇవేవీ వైరస్ వ్యాప్తిని ఆపలేకపోతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications