మావోయిస్టులకు భారీ దెబ్బ: 10 మంది ఎన్కౌంటర్..!!
Chhattisgarh encounter: ఛత్తీస్గఢ్ అడవులు మరోసారి రక్తమోడాయి. కాల్పుల మోతలతో దండకారణ్యం మార్మోగింది. తాజాగా చోటు చేసుకున్న ఎన్కౌంటర్.. మావోయిస్టులకు భారీగా ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. కోలుకోలేని దెబ్బ కొట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
తాజాగా ఛత్తీస్గఢ్లో సంభవించిన ఎన్కౌంటర్లో 10మంది మావోయిస్టులు మరణించారు. సంఘటన స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు లభించాయి. దాదాపుగా అవన్నీ కూడా ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ ఆయుధాలే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

సుక్మా జిల్లాలో విస్తరించిన దండకారణ్యంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. సుక్మా పశ్చిమ ప్రాంతంలో అడవుల్లో మావోయిస్టులు సమావేశమైనట్లు పక్కా సమాచారం అందిన నేపథ్యంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ బలగాలు, పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. కూంబింగ్ నిర్వహించారు.
ఈ ఉదయం కూంబింగ్ కొనసాగుతున్న సమయంలో మావోయిస్టులు తారసపడ్డారు. పరస్పరం ఎదురుకాల్పలకు దిగారు. ఈ ఘటనలో 10 మంది మావోయిస్టులు మరణించారు. తొలుత వారిని లొంగిపోవాలంటూ హెచ్చరించామని, దీన్ని పట్టంచుకోకుండా మావోయిస్టులు కాల్పులకు దిగారని బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ పీ సుందర్ రాజ్ తెలిపారు.
దీనితో బలగాలు ఎదురుకాల్పులకు దిగాయని వివరించారు. ఈ ఘటనలో మొత్తం 10 మంది మావోయిస్టులు మరణించారని అన్నారు. మరికొందరు తప్పించుకున్నట్లు సమాచారం ఉందని, వారికోసం పెద్ద ఎత్తున అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నామని చెప్పారు.
సంఘటన స్థలం నుంచి సెల్ఫ్ లోడింగ్ రైఫిళ్లు, ఇన్సాస్, ఏకే 47 సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఛత్తీస్గఢ్లో మూడు నెలల వ్యవధిలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం ఇది రెండోసారి. సెప్టెంబర్ 9వ తేదీన దంతెవాడ- బిజాపూర్ అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో తొమ్మిదిమంది మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే.
అంతకుముందు నారాయణ్పూర్ సమీపంలోని అబూజ్మఢ్ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. వారిని పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ సభ్యులుగా గుర్తించారు.












Click it and Unblock the Notifications