రిగ్గింగ్ అడ్డుకున్నాడని నాలుక కత్తిరించారు, ఎఫ్ఐఆర్
లక్నో/పాట్నా: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రిగ్గింగ్ను అడ్డుకున్నందుకు ఓ పోలింగ్ ఏజెంట్ నాలుకను కత్తిరంచారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో జరిగింది. ఇందుకు సంబంధించి 11 మంది పైన పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.
నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు సోమవారం నాడు వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలిదశ పోలింగ్ సమయంలో ఇది జరిగిందని తెలిపారు.
శుక్రవారం నాడు తొలి దఫా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అయితే, రమాకాంత్, అతని తనయుడులు రాణిగంజ్లోని ప్రజాపతి పోలింగ్ బూత్లోని ఏజెంట్ నాలుకను కత్తిరించారు. అతను రిగ్గింగ్ అడ్డుకున్నందునే ఇలా చేశారు. దీంతో, ఫిర్యాదు అందడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
రమాకాంత్, అతని తనయుడులు దినకర్, దుర్గేష్, వినోద్, ఆదర్శ్, మరో వ్యక్తి బబ్లూ, మరో ఐదుగురి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ముగిసిన బీహార్ తొలిదశ పోలింగ్
బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ సోమవారం ముగిసింది. పది జిల్లాల్లోని 49 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.
కొన్నిచోట్ల నిర్ణీత సమయంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో ఆయా కేంద్రాలలో పోలింగ్ ఆలస్యమైంది. సాయంకాలం నాలుగు గంటల సమయానికి 52.12 శాతం పోలింగ్ నమోదైంది. పూర్తిస్థాయిలో ఎంత పోలింగ్ నమోదైందన్న వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. తొలి దశ పోలింగ్ 57 శాతం.