బాణాసంచా ఫ్యాక్టరీలో మంటలు, 11 మంది మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం..
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయిం. విరుద్ నగర్ జిల్లా వెంబకొట్టాయ్ వద్ద గల ఫ్యాక్టరీ వద్ద శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 11 మంది కూలీలు చనిపోయినట్టు తెలుస్తోంది. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని శివకాశీ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారిని గుర్తించాల్సి ఉందని కలెక్టర్ ఆర్ కన్నన్ పేర్కొన్నారు.
మధ్యాహ్నం 1.30 గంటలకు మరియమ్మల్ ఫైర్ వర్క్స్ వద్ద ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగిన వెంటనే ఘటనాస్థలానికి అంబులెన్సులు చేరుకున్నాయి. సత్తూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో 22 మంది కూలీలను చేర్చారు. వారికి 50 శాతం గాయాలు అయ్యాయని వైద్యులు తెలిపారు. ఘటనా స్థలంలో మంటలను ఆర్పివేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. కానీ అందులో ఉన్న మండే స్వభావం గల ద్రవణంతో మంటలు ఆరడం లేదు. దీంతో లోపలికి వెళ్లడానికి వీలుకావడం లేదు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. తలా రూ.2 లక్షలు అందజేస్తామని ప్రధాని మోడీతెలిపారు.