13 వేల స్కూల్స్: ప్రధాని మోడీకి లేఖ.. సర్కార్ అవినీతి మయం అంటూ..
కర్ణాటక ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందట.. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు తెలియజేయలేదు. రెండు అసోసియేషన్లు కలిసి కేంద్రం ప్రభుత్వానికి లేఖ రాశాయి. వాటిలో దాదాపు 13 వేల స్కూల్ యాజమన్యాలు ఉన్నాయి. వీటిలో ప్రైమరీ, సెకండరీ స్కూల్స్ ఉంటాయి. ఈ మేరకు తమ సమస్యల గురించి ప్రధాని మోడీకి లేఖ రాశాయి.
పాఠశాలల గుర్తింపు కోసం భారీగా నగదును విద్యాశాఖ అడుగుతుందని ద అసోసియేటెడ్ మేనెజ్మెంట్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్స్ మరియు ద రిజిష్టర్డ్ ఆన్ ఎయిడెట్ ప్రైవేట్ స్కూల్స్ మేనెజ్ మెంట్ అసోసియేషన్ లేఖ రాసింది. వీటిపై ప్రధాని మోడీ దృష్టిసారించాలని ఆ లేఖలో కోరాయి. దీనిపై దర్యాప్తు జరిపించాలని కోరాయి.
అశాస్త్రీయమైన, హేతుబద్ధత లేని, వివక్షపూరితమైన, ఆచరణ సాధ్యంకానీ నిబంధనలను కేవలం అన్ఎయిడెడ్ పాఠశాలలకు మాత్రమే వర్తింపజేస్తోందని లేఖలో తెలిపాయి. అవినీతి తార స్థాయిలో ఉందని ఆరోపించాయి. కర్ణాటక విద్యా శాఖ మంత్రి బీసీ నగేష్కు అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం కనిపించలేదని చెప్పాయి. అతనిని తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.
వ్యవస్థలోని పరిస్థితిని అర్థం చేసుకుని, సమస్యలను పరిష్కరించడానికి విద్యా మంత్రిత్వ శాఖ సిద్ధంగా లేదని పేర్కొన్నాయి. బడ్జెట్ స్కూళ్ళకు ఇద్దరు బీజేపీ విద్యా శాఖ మంత్రులు తీరని నష్టం చేశారని ఆరోపించాయి. ఎక్కువ మంది పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్న, తల్లిదండ్రుల నుంచి భారీ స్థాయిలో ఫీజులు గుంజుతున్న పాఠశాలల కన్నా బడ్జెట్ స్కూళ్ళను దారుణంగా దెబ్బతీశాయని పేర్కొన్నాయి.