ఇప్పటికే దేశం విడిచి వెళ్లాడు: విజయ్ మాల్యా జంప్?
ఢిల్లీ: విజయ్ మాల్యా దేశాన్ని విడిచి వెళ్లకుండా పలు బ్యాంకులు ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. సుప్రీం కోర్టులో దానిపై బుధవారం విచారణ జరగాల్సి ఉంది. అయినప్పటికి మాల్యా దేశం దాటిపోయినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తనకు సురక్షితంగా ఉండే వేరే దేశంలో తలదాచుకున్నారట.
అంతకుముందు.. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ నష్టాలతో లాభదాయక వ్యాపారాలను ఒక్కటొక్కటిగా వదులుకుంటున్న విజయ్ మాల్యా నుంచి అప్పులు రాబట్టుకునేందుకు ఆయనకు రుణాలిచ్చిన బ్యాంకులు కోర్టుకు వరస కట్టాయి.
మాల్యా లండన్కు వెళ్లిపోతున్నారన్న వార్తలు తెలియగానే ఉలిక్కిపడ్డాయి. ఆ వెనువెంటనే తేరుకుని కోర్టుల గడప తొక్కాయి. ఇప్పటికే డియాజియో నుంచి మాల్యాకు అందే రూ.515 కోట్లపై హక్కు తమకు కల్పించాలని ఎస్బిఐ బ్యాంక్ బెంగళూరులోని డెబిట్ రికవరీ ట్రైబ్యునల్ (డీఆర్టీ)ని ఆశ్రయించి సత్పలితాన్నే రాబట్టింది.
ఆ తర్వాత.. మాల్యాకు వందలాది కోట్ల రూపాయల రుణాలచ్చిన 17 బ్యాంకులు ఏకంగా సర్వోన్నత న్యాయస్థానం గడప తొక్కాయి. తమ అప్పులను తీర్చేదాకా విజయ్ మాల్యాను దేశం విడిచివెళ్లకుండా కట్టడి చేయాలని ఆ బ్యాంకులు పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. బుధవారం విచారణ జరగనుంది. అయితే అప్పటికే మాల్యా దేశం విడిచి వెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి.