మహారాష్ట్రలో మరో ఘోరం-ఐసీయూలో కాలిబూడిదైన 13 మంది కోవిడ్ రోగులు
మహారాష్ట్రలో కోవిడ్ సందర్భంగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలు రోగుల ఉసురుతీస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఆక్సిజన్ లీకే జాకీర్ హుస్సేన్ ఆస్పత్రిలో 24 మంది రోగులు మృత్యువాత పడిన దారుణ ఘటన మర్చిపోకముందే మరో ఘోరప్రమాదం చోటు చేసుకుంది. పాల్ఘర్ జిల్లాలోని విరార్లో జరిగిన ఈ ఘటనలో 13 మంది కోవిడ్ రోగులు సజీవదహనం అయ్యారు.
పాల్ఘర్ జిల్లాలోని విరార్లో ఉన్న విజయ్ వల్లభ్ ఆస్పత్రిలో ఈ తెల్లవారు జామున 3 గంటల ప్రాతంలో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో నాలుగు అంతస్తుల ఈ ఆస్పత్రిలోని రెండో అంతస్ధులో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులు వీటి బారిన పడ్డారు. ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో 13 మంది రోగులు మంటల్లో పడి కాలి బూడిదయ్యారు. వీరంతా ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగులే కావడం విశేషం. ఇక్కడ మొత్తం 17 మంది రోగులు ఐసీయూలో కోవిడ్ చికిత్స పొందుతున్నట్లు తేలింది.
అగ్నిప్రమాద ఘటన తెలియగానే అక్కడి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటల్ని ఆర్పే ప్రయత్నం చేసినా అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఈ ఘటనలో గాయపడిన మరికొందరు రోగుల్ని సమీప ఆస్పత్రులకు పంపి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. గాయపడ్డ వారికి లక్ష రూపాయల చొప్పున పరిహారం అందించాలని సీఎం ఉద్దవ్ ధాక్రే ఆదేశాలు ఇచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ కూడా మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సానుభూతి ప్రకటించారు.