బెంగాల్ ఊపు: మోడీ సర్కార్కు ప్రతిపక్షాల ఘాటు లేఖ: చంద్రబాబు పేరు మిస్: తొలిరోజే తలనొప్పి
న్యూఢిల్లీ: ఎన్నో ఆశలు పెట్టుకున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీని తీవ్ర నిరాశకు గురి చేశాయి. అటు తమిళనాడులో ఎన్డీఏ మిత్రపక్షం ఏఐఎడీఎంకే పరాజయంపాలైంది. కేరళలో ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది. ఉన్న సీటును కూడా కోల్పోవాల్సి వచ్చింది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోన్నప్పటికీ- పొత్తుపార్టీ అఖిల భారత ఎన్నార్ కాంగ్రెస్ను చూసి ప్రజలు బీజేపీ ఓట్లు వేశారనేది స్పష్టమౌతోంది. దీన్ని తమ విజయంగా భావించట్లేదు బీజేపీ. అస్సాంలో అధికారాన్ని నిలబెట్టుకున్నప్పటికీ.. అంతర్గత సమస్యలు తలెత్తుతున్నాయి.
వాపును చూసి: రెండేళ్లలో దారుణంగా బీజేపీ ఓట్లశాతం: పోరాడితే పోయేదేమీ లేదంటారు గానీ
బలపడ్డ ప్రతిపక్షం..
ఈ పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి సారథ్యాన్ని వహిస్తోన్న కమలనాథులకు కొత్త తలనొప్పులు అప్పుడే మొదలయ్యాయి కూడా. పశ్చిమ బెంగాల్లో ఘోర పరాజయం.. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మిగిలిన రాష్ట్రాల్లో నాసిరకం ప్రదర్శన.. వంటి పరిణామాలు బీజేపీ బలహీన పడుతోందనే సంకేతాలను పంపించినట్టయింది. ఇది కాస్తా ప్రతిపక్ష పార్టీలకు సరికొత్త బలాన్ని ఇచ్చినట్టయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతోన్నన సమయంలోనే- 13 ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాయి.
13 ప్రతిపక్ష పార్టీల నేతల లేఖ
కరోనా వైరస్ సెకెండ్ వేవ్ భయానక పరిస్థితులు ఏర్పడటానికి కారణమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఉచితంగా కోవిడ్ 19 వ్యాక్సినేషన్ డ్రైవ్ను చేపట్టాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు 13 ప్రతిపక్ష పార్టీల నేతలు సోనియాగాంధీ-కాంగ్రెస్, హెచ్డీ దేవేగౌడ-జనతాదళ్ సెక్యులర్, శరద్ పవార్-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఉద్ధవ్ థాకరే-శివసేన, మమతా బెనర్జీ-తృణమూల్ కాంగ్రెస్, హేమంత్ సోరెన్-జార్ఖండ్ ముక్తిమోర్చా, ఎంకే స్టాలిన్-డీఎంకే, మాయావతి-బహుజన్ సమాజ్వాది పార్టీ, ఫరూక్ అబ్దుల్లా-జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ అలయన్స్, అఖిలేష్ యాదవ్-సమాజ్ వాది పార్టీ, తేజస్వి యాదవ్-రాష్ట్రీయ జనతాదళ్, డీ రాజా-సీపీఐ, సీతారాం ఏచూరి-సీపీఎం కేంద్రానికి లేఖ రాశారు.
ఆక్సిజన్ కొరతను అధిగమించేలా..
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు లక్షల్లో నమోదవుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని నియంత్రించడానికి తక్షణ చర్యలను తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. యాక్టివ్ కేసులు 32 లక్షలకు దాటాయని గుర్తు చేశారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలను పెంచుకోవాలని సూచించాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టడానికి కేంద్రబడ్జెట్లో కేటాయించిన 35,000 కోట్ల రూపాయలను దీనికోసం వినియోగించుకోవాలని పేర్కొన్నాయి.
చంద్రబాబు పేరు గల్లంతు..
ఈ జాబితాలో చంద్రబాబు పేరు లేదు. 2019 నాటి సాధారణ ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల జాబితాలో తెలుగుదేశం చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, జేడీఎస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే వంటి పార్టీల అధినేతలతో చంద్రబాబు చేతులు కలిపారు. వారితో కలిసి కేంద్రంపై పోరాటాన్ని సాగించారు. కోల్కతలో నిర్వహించిన బహిరంగ సభకు సైతం చంద్రబాబు హాజరయ్యారు. సాధారణ ఎన్నికల అనంతరం ఆ ప్రతిపక్ష పార్టీలు అలాగే కొనసాగుతోన్నప్పటికీ.. చంద్రబాబు మాత్రం వారితో కలవట్లేదు. ప్రతిపక్ష కూటమి నుంచి తప్పుకొన్నారు. వారితో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.