ఇంత ఘోరమా..! : రేప్ చేసి, కాళ్లు తగలబెట్టి..
ఔరాయియా : ఉత్తరప్రదేశ్ లోని ఔరాయియా గ్రామంలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితులు.. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సదరు బాలిక యత్నించగా ఆమె కాళ్లను డీజిల్ పోసి తగలబెట్టారు. అత్యంత పాశవికంగా బాలికపై నిందితులు జరిపిన ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తెలియవస్తున్న వివరాల ప్రకారం.. దాదాపు ఆరు నెలల క్రితం ఈ ఘటన జరగ్గా, నిందితుల నుంచి బాలిక కుటుంబంపై వరుస దాడులు జరిగిన నేపథ్యంలో సదరు బాలిక గానీ, ఆమె కుటుంబ సభ్యలు గానీ పోలీసులకు ఫిర్యాదు చేసే ధైర్యం చేయలేకపోయారు.
గతేడాది డిసెంబర్ 31న బాలికపై అత్యాచారం చేసిన నిందితులు, మరుసటి రోజు ఆమె కుటుంబీకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్తుండగా మరోసారి బాలికపై దారుణానికి ఒడిగట్టారు. నిందితులు ఇద్దరు మరియు అతని నలుగురు అక్కా చెల్లెళ్లు కలిసి బాధిత బాలిక కాళ్లపై డీజిల్ పోసి నిప్పంటించారు. దీంతో బాలిక రెండు కాళ్లు పూర్తిగా కాలిపోయి అత్యంత ధీనావస్థలో ఉంది.
ఘటనపై బాధిత బాలిక వెల్లడించిన వివరాల ప్రకారం.. పోలీసులను ఆశ్రయించాలనుకున్న ప్రతిసారి నిందితులు తమపై దాడికి పాల్పడుతున్నట్టుగా ఆవేదన వ్యక్తం చేసింది. తనకు చేసిన దారుణాన్నే తన కుటుంబీకులకు ఎక్కడ తలపెడుతారోననన్న భయంతోనే విషయాన్ని బయటపెట్టే ధైర్యం చేయలేదని చెప్పుకొచ్చింది.
బాధిత బాలిక కుటుంబ నేపథ్యం పేదవారు కావడంతో ఆమెకు సరైన చికిత్స అందక, కాళ్లపై కాలిపోయిన గాయాలతో బాలిక నరకయాతన అనుభవిస్తోంది. అయితే, ఇదంతా గమనించిన స్థానికుడు ఒకాయన బాలిక కేసును సీనియర్ సూపరిండెంట్ ఆఫీసర్ అతుల్ శర్మ ద్రుష్టికి తీసుకెళ్లడంతో ఈ ఉదంతం బయటపడింది.
కాగా, ఆ వ్యక్తి సహాయంతో నిందితులపై కేసు నమోదు చేశారు బాలిక కుటుంబీకులు. దీనిపై స్పందించిన సూపరిండెంట్ ఆఫీసర్ అతుల్ శర్మ.. నిందితులపై తక్షణం చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
అలాగే కాలిన గాయాలతో సతమవుతున్న బాలికను మెరుగైన చికిత్స కోసం ఔరాయియాకు 80 కి.మీల దూరంలో ఉన్న మరో ఆసుపత్రికి తరలించారు.