బాబుకు ఊరట: ఏపీకి కేంద్రం భారీ సాయం, రూ.22వేల 113 కోట్లు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కొంత ఊరట. రానున్న ఐదేళ్లలో ఏపీ రెవెన్యూ లోటును పూడ్చేందుకు కేంద్రం సాయం చేస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం తెలిపారు. ఏపీకి 2015-2020 మధ్యలో రూ.22వేల 113 కోట్ల రూపాయల సాయం అందించనున్నట్లు జైట్లీ తెలిపారు.
14వ ఆర్థికసంఘం సిఫార్సులను కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ లోకసభలో ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్కు భారీగా నిధులు, గ్రాంట్లను 14వ ఆర్థికసంఘం సిఫార్సు చేసింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్రంలోని నిధులు ఆర్థిక మంత్రుల అనుసారంగా రాష్ర్టానికి నిధులు, గ్రాంట్లు సిఫార్సు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం సూచించింది.
ఈ మేరకు ఇటీవల తెలంగాణ, ఏపీలో ఆర్థిక సంఘం సభ్యులు పర్యటించారు. ఈ సందర్భంగా పారిశ్రామిక, ఆర్థిక పురోగతికి సంబంధించి ద్రవ్యప్రోత్సాహకాలు భారీగా 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆర్థిక సంఘం ద్వారా 13వేల కోట్లు రాష్ర్టానికి వస్తూనే ఉన్నాయి.
అయితే విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేకమైన ప్రోత్సహకాలు ఇవ్వాలంటూ విభజన చట్టంలో పేర్కొన్న తరుణంలో 14వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి ముఖ్యంగా ఏపీకి భారీగా నిధులు, గ్రాంట్లను అందజేసింది. దీనికి సంబంధించి కేంద్రమంత్రి జైట్లీ ఆర్థిక సంఘం సిఫార్సులను లోకసభలో ప్రవేశపెట్టారు.
అనంతరం ఆయన మధ్యాహ్నం విలేకరుల సమావేశంలోమాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, అసోం, హిమాచల్ ప్రదేశ్ సహా 11 రాష్ట్రాలలో 1,94,021 కోట్ల లోటు ఉందని చెప్పారు. 14న ఆర్థిక సంఘం సిఫార్సులను పరిశీలించామని, సభలో ప్రవేశ పెట్టామని తెలిపారు.
విభజన తర్వాత ఏపీలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న ఆర్థిక సంఘం నూతన రాజధాని నిర్మాణానికి, అవసరమైన సాంకేతిక అభివృద్ధికి నిధులను కేటాయించింది.
రాజధానికి సంబంధించి ఈ ఏడాది సుమారు రూ.5వేల కోట్లకు పైగా, ప్రతీ ఏడాది రూ.20వేల కోట్లకుపైగా ఇవ్వాల్సిందిగా ఆర్థిక సంఘం సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే ఏపీకి ఏడువేల కోట్ల అవార్డును ప్రత్యేకంగా సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది.
కేంద్ర పన్నుల్లో 42 శాతం రాష్ట్రాల వాటా ఉంటుంది. స్థానిక సంస్థల ద్వారా మరో నాలుగైదు శాతం ఏపీకి ఇవ్వాలని ప్రణాళిక సంఘం సూచించింది. 2015-16కు గాను రూ.6609 కోట్లు, 2016-17కు గాను దాదాపు అయిదువేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం రానుంది. గుజరాత్కు ఐదేళ్లకు రూ.11,795 కోట్లు ఇవ్వనున్నారు. కాగా, 16వ ఆర్థిక సంఘం నాటికి రెండు రాష్ట్రాల్లోను మిగులు బడ్జెట్ ఉండంనుంది. తెలంగాణలో రూ.818 కోట్ల మిగులు రెవెన్యూ ఉంది.