దేశంలో కొత్తగా 15,906 కరోనా పాజిటివ్ కేసులు - 561 మరణాలు : 1.02 కోట్లకు చేరిన టీకాలు..!!
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ క్రమేణా తగ్గుముఖం పట్టింది. వరుసగా నమోదవుతున్న పాజిటివ్ కేసులు.. మరణాల సంఖ్యలో హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి. ఈ రోజు వెల్లడించిన లెక్కల ప్రకారం గత రోజు కంటే కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. తాజాగా 16 వేలకు దిగువన కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. గడిచిన 24 గంటల్లో 13,40,158 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 15,906 పాజిటివ్ కేసులు గుర్తించారు.
ఇక పలు రాష్ట్రాలు మరణాల సంఖ్యను సవరిస్తుండటంతో ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. నిన్న 561 మంది కొవిడ్తో మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 454269కి చేరింది. గత కొన్ని రోజులుగా కొత్తగా నమోదవుతున్న కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం ఊరటనిస్తోంది. శనివారం 16,479 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కొవిడ్ను జయించిన వారి సంఖ్య 3.35 కోట్లకు చేరి ఆ రేటు 98.17 శాతానికి పెరిగింది. గత ఏడాది మార్చి నుంచి ఇదే అత్యధికం.
క్రియాశీల కేసుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,72,594 చేరి ఆ రేటు 0.51 శాతానికి దిగివచ్చింది. ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 77,40,676 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటి వరకూ అందించిన టీకా డోసుల సంఖ్య 1.02 కోట్లకు చేరింది. తాజాగా 100 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తి చేసిన తరువాత ప్రధాని జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలోనూ కీలక సూచనలు చేసారు.
పండుగల సీజన్ లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మాస్కు వినియోగం తప్పని సరి చేసుకోవాలని సూచించారు. ఇక, తాజాగా కేంద్రం సైతం బూస్టర్ డోస్ ను వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏయిమ్స్ చీఫ్ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారదు. దీంతో..రెండు డోసులు పూర్తి చేసుకున్న వారిలోని దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారికి ... రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు.