చిదిమేశారు: బాలికపై ఆర్టీసి డ్రైవర్స్, కండక్టర్ గ్యాంగ్ రేప్!..
రాణిబెన్నూరుకు అతన్ని వెతుక్కుంటూ వెళ్లిన బాలిక అక్కడే సామూహిక అత్యాచారానికి గురైంది.
బెంగళూరు: ఒంటరిగా స్త్రీ కనిపిస్తే చాలు.. వయసుతో నిమిత్తం లేకుండా వారిపై అత్యాచారాలు చోటు చేసుకుంటున్నాయి. బాలికల నుంచి వృద్దుల దాకా మహిళా లోకం మొత్తం ఈ వేధింపులకు గురవుతూనే ఉంది. తాజాగా ఆర్టీసీ బస్సు డ్రైవర్స్, కండక్టర్ కలిసి ఓ మైనర్ బాలికను చిదిమేసిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మణిపాల్ కు చెందిన మైనర్ బాలిక(15) ఉడుపిలో కాలేజీలో చదువుతోంది. ఇదే కాలేజీలో చదువుతున్న ఓ యువకుడితో ఆమె ప్రేమలో పడింది. అయితే ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో.. ఆ యువకుడు కర్ణాటకలోని హవేరి జిల్లాలో ఉన్న తన స్వగ్రామం రాణిబెన్నూరుకు వెళ్లిపోయాడు.
అయితే ఎలాగైనా ప్రియుడిని కలవాలని భావించిన బాలిక.. కేఎస్ఆర్టీసీ బస్ ద్వారా ఈ నెల 5న మణిపాల్ నుంచి రాణిబెన్నూరుకు వచ్చింది. ఒంటరిగానే వచ్చిన బాలిక.. అక్కడ ప్రతీ వీధి అతని కోసం గాలించింది. ఎక్కడా అతని ఆచూకీ దొరకకపోవడంతో.. అదే రోజు రాత్రి మణిపాల్ వెళ్లడానికి రాణిబెన్నూర్ బస్టాండ్ కు చేరుకుంది.
బాలిక ఒంటరిగా ఉందని గమనించిన కేఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్స్ వీరయ్య హీరేమఠ(45), కండక్టర్ యువరాజ్ కట్టెకార్ (45)తో పాటు, కండక్టర్ రాఘవేంద్ర బడిగేర్(35) సహా మరో వ్యక్తి.. తాము సహాయం చేస్తామంటూ మాయ మాటలు చెప్పారు. ఆపై ఖాళీగా ఉన్న బస్సులోకి తీసుకెళ్లి సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం బయటకు పొక్కితే.. చంపేస్తామని బెదిరించారు.
అనంతరం అదే బస్సులో మరుసటి రోజు మిగతా ప్రయాణికులతో పాటు ఆమెను మణిపాల్ లో దించేశారు. ఇంటికి చేరుకున్న తర్వాత.. బాలిక విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.