పౌల్ట్రీ ఫామ్లో బాలికపై 22 రోజులు గ్యాంగ్ రేప్... ఇంటికి తీసుకెళ్తానని నమ్మించి...
మహిళల రక్షణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా... ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా కామాంధుల అఘాయిత్యాలకు తెరపడట్లేదు. ఇటీవలి హత్రాస్ ఘటనపై దేశమంతా చర్చించుకుంటున్న తరుణంలోనూ నిత్యం ఎక్కడో చోట మహిళలపై అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.తాజాగా ఒడిశాలోని కటక్లో మైనర్ బాలికపై అత్యాచార ఘటన వెలుగుచూసింది. బాలికను కిడ్నాప్ చేసిన ఓ వ్యక్తి ఆమెను నిర్బంధించి... మరొకరితో కలిసి 22 రోజుల పాటు గ్యాంగ్ రేప్కు పాల్పడ్డాడు.
అసలేం జరిగింది..
ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లా తిర్తోల్కి చెందిన 17 ఏళ్ల బాలిక ఇటీవల తన తల్లిదండ్రులతో గొడవపడి ఇంటి నుంచి పారిపోయింది. ఈ క్రమంలో కటక్లోని ఓఎంపీ స్క్వేర్ బస్టాండ్ వద్దకు చేరుకున్న ఆ బాలికను ఓ వ్యక్తి గమనించాడు. ఆమె వివరాలు తెలుసుకుని ఓదార్చినట్లు నటించాడు. తనతో వస్తే ఇంటికి తీసుకెళ్తానని చెప్పాడు. బాలిక ఆ మాటలు నమ్మి అతని వెంట బయలుదేరింది. కానీ అతను బాలికను తిర్తోల్కు బదులు గతిరౌత్పట్నా గ్రామంలోని ఓ పౌల్ట్రీ ఫామ్కు తీసుకెళ్లాడు.
పౌల్ట్రీ ఫామ్లో 22 రోజులు గ్యాంగ్ రేప్...
పౌల్ట్రీ ఫామ్లో బాలికను నిర్బంధించిన అతను మరో యువకుడితో కలిసి 22 రోజుల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పౌల్ట్రీ ఫామ్లో అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో స్థానిక పోలీసులు ఫామ్పై దాడులు చేశారు. ఈ సందర్భంగా బాలికను గుర్తించిన పోలీసులు ఆమెను రక్షించారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసి అతనిపై ఐపీసీ సెక్షన్లు 376(2)(c), 376(2)(g)ల కింద కేసులు నమోదు చేశారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ప్రభుత్వంపై విపక్షాల ఫైర్...
బాధిత బాలికను మొదట జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచిన పోలీసులు... అనంతరం ఆమెను అనాథాశ్రమానికి తరలించారు. ఈ ఘటనపై విపక్షాలు బీజేపీ,కాంగ్రెస్లు బీజేడీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాయి. నవీన్ పట్నాయక్ ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమైందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేఖశ్రీ ఆరోపించారు. వచ్చే నెలలో ఉపఎన్నిక జరగనున్న తిర్తోల్లోనే ఈ ఘటన జరగడంతో... బీజేడీ ఏ ముఖం పెట్టుకుని అక్కడ ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రతినిధి నిశికాంత్ మిశ్రా కూడా బీజేడీ ప్రభుత్వం మహిళా రక్షణలో విఫలమైందన్నారు. బాధితురాలి కుటుంబానికి రూ.25లక్షలు సాయం అందించాలని డిమాండ్ చేశారు. క్రైమ్ బ్రాంచ్తో ఘటనపై విచారణకు ఆదేశించాలన్నారు.