పెట్రోలింగ్ వాహనమే లక్ష్యంగా ల్యాండ్మైన్ పేలుడు: ఇద్దరు సైనికులు మృతి, మరో ముగ్గురికి గాయాలు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆర్మీ పెట్రోలింగ్ వాహనం లక్ష్యంగా ల్యాండ్ మైన్ పేల్చారు. దీంతో ఇద్దరు సైనికులు మరణించగా, మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. ఈ ఘటన వాస్తవాధీన రేఖ సమీపంలోని నౌషేరా-సుందర్బనీ సెక్టార్ వద్ద శనివారం చోటు చేసుకుంది.
ల్యాండ్ మైన్ పైకి వాహనం వెళ్లగానే పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. దీంతో సైనికులు మృతి చెందారని తెలిపారు. గాయపడిన సైనికులకు ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
'నౌషేరా సెక్టార్లో ఏరియా డామినేషన్ పెట్రోలింగ్ సమయంలో, మందుపాతర పేలుడు సంభవించింది, ఇందులో ఇద్దరు భారత ఆర్మీ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు, తరువాత వారు మరణించారు. గాయపడిన మరో సైనికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ' అని జమ్మూ ప్రాంతంలోని రక్షణ ప్రతినిధి ఒకరు అన్నారు.
'లెఫ్టినెంట్ రిషి కుమార్, సైనికుడు మంజిత్ ధైర్యవంతులు. సైనిక వృత్తి పట్ల చాలా నిబద్ధత కలిగి ఉన్నారు. క్రియాశీల విధి నిర్వహణలో దేశం కోసం అత్యున్నత త్యాగం చేశారు. లెఫ్టినెంట్ రిషి కుమార్ బీహార్లోని బెగుసరాయ్ నివాసి. సిపాయి మంజిత్ సింగ్, సిర్వేవాలా, భటిండా నివాసి, పంజాబ్కు చెందినవారు. వారి అత్యున్నత త్యాగానికి , వారి ధైర్య హృదయాలకు దేశం, భారత సైన్యం ఎప్పటికీ రుణపడి ఉంటాయి' అని ప్రతినిధి తెలిపారు.
నౌషేరా సెక్టార్ జమ్మూలోని పిర్పంజల్ ప్రాంతంలో భాగమైన రాజౌరి జిల్లా పరిధిలోకి వస్తుంది, ఇక్కడ గత మూడు వారాలుగా ఆర్మీ ఆపరేషన్ జరుగుతోంది.